RBI : రుణాల కోసం సరికొత్త డిజిటల్ వేదిక: కేంద్రం ప్రవేశపెట్టనున్న ULI:భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పు తరహాలోనే, రుణాల విభాగంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. రుణాలు పొందే ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ‘యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్’ (ULI) అనే సరికొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
UPI తరహాలో ULI: రుణ ప్రక్రియను సులభతరం చేయనున్న సరికొత్త డిజిటల్ వేదిక
భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పు తరహాలోనే, రుణాల విభాగంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. రుణాలు పొందే ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ‘యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్’ (ULI) అనే సరికొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ అంశంపై ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సంయుక్తంగా ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాయి.
ULI అనేది ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFCలు), ఫిన్టెక్ సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, క్రెడిట్ బ్యూరోలను ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. దీని ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడం, వాటిని వేగంగా మంజూరు చేయడం చాలా సులభతరం అవుతుంది.
వినియోగదారుడి అనుమతితో, వారి KYC, ఆధార్, పాన్ కార్డ్, GST, ఆదాయపు పన్ను రిటర్న్స్, భూ రికార్డులు, యుటిలిటీ బిల్లులు వంటి డిజిటల్ డేటాను రుణ సంస్థలు సులభంగా యాక్సెస్ చేయగలవు. ఈ సమాచారం ఆధారంగా, ఎలాంటి పూచీకత్తు (కొల్లేటరల్) లేదా సుదీర్ఘమైన డాక్యుమెంటేషన్ లేకుండానే రుణాలు మంజూరు చేసేందుకు వీలవుతుంది. UPIలో మొబైల్ నంబర్ లేదా QR కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేసినంత సులభంగా, భవిష్యత్తులో ULI ద్వారా రుణాలు పొందవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) సులభంగా రుణాలు అందించడమే ULI ప్రధాన లక్ష్యం. సరైన క్రెడిట్ హిస్టరీ, పూచీకత్తు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న వ్యాపారులకు ఇది ఒక వరంలా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక సేవలను దేశంలోని ప్రతి ఒక్కరికీ అందించాలనే లక్ష్యంతో, UPI స్ఫూర్తితో ఈ కొత్త వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక సేవల కార్యదర్శి ఎం. నాగరాజు, RBI డిప్యూటీ గవర్నర్ టి. రబి శంకర్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read also:Telangana : టీజీపీఎస్సీ గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టులో వాదనలు
