Himachal Floods : కుక్క అరుపుతో బతికిన 20 కుటుంబాలు: మండి జిల్లాలో ఘటన:హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల సంభవించిన విపత్తులో ఒక అద్భుత సంఘటన వెలుగులోకి వచ్చింది. మండి జిల్లా ధర్మపూర్ ప్రాంతంలోని సియాతి గ్రామంలో జూన్ 30 అర్థరాత్రి, ఒక పెంపుడు కుక్క 67 మంది గ్రామస్తుల ప్రాణాలను కాపాడింది.
పెను ప్రమాదం నుండి గ్రామస్తులను రక్షించిన పెంపుడు కుక్క
హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల సంభవించిన విపత్తులో ఒక అద్భుత సంఘటన వెలుగులోకి వచ్చింది. మండి జిల్లా ధర్మపూర్ ప్రాంతంలోని సియాతి గ్రామంలో జూన్ 30 అర్థరాత్రి, ఒక పెంపుడు కుక్క 67 మంది గ్రామస్తుల ప్రాణాలను కాపాడింది. అర్థరాత్రి సమయంలో కుండపోత వర్షం కురుస్తుండగా, గ్రామస్తుడు నరేంద్ర ఇంట్లో నిద్రిస్తున్న పెంపుడు కుక్క అకస్మాత్తుగా గట్టిగా అరవడం, ఊళలు వేయడం ప్రారంభించింది.
ఆ అరుపులకు నరేంద్రకు మెలకువ రావడంతో, అతను వెళ్లి చూడగా ఇంటి గోడకు పెద్ద పగులు ఏర్పడి, నీరు లోపలికి వస్తున్నట్లు గమనించాడు. వెంటనే అతను తన కుటుంబాన్ని, ఆ తర్వాత గ్రామస్తులందరినీ నిద్రలేపి సురక్షిత ప్రాంతానికి వెళ్ళమని హెచ్చరించాడు. వారు గ్రామాన్ని ఖాళీ చేసిన కొద్దిసేపటికే భారీ కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ఇళ్ళు నేలమట్టమయ్యాయి. గ్రామం మొత్తం శిథిలాల కింద కూరుకుపోయింది.
ప్రాణాలతో బయటపడిన వారంతా ప్రస్తుతం సమీపంలోని నైనా దేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ ఘటనతో చాలామంది గ్రామస్తులు రక్తపోటు, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ప్రభుత్వం వారికి తక్షణ సాయంగా రూ. 10,000 అందించింది. తమ కళ్ల ముందే ఇళ్లు మట్టిలో కలిసిపోయినా, ప్రాణాలతో బయటపడినందుకు గ్రామస్తులు ఊరట చెందుతున్నారు.
రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నివేదిక ప్రకారం, జూన్ 20న రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుండి హిమాచల్ ప్రదేశ్లో వర్ష సంబంధిత ఘటనల వల్ల 50 మంది, రోడ్డు ప్రమాదాల్లో 28 మంది సహా మొత్తం 78 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 కొండచరియలు విరిగిపడటం, 19 మేఘ విస్ఫోటాలు, 23 ఆకస్మిక వరదలు సంభవించాయి. మండి జిల్లాలోనే అత్యధిక మరణాలు నమోదయ్యాయి. మరోవైపు, భారత వాతావరణ శాఖ 10 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక జారీ చేసింది.
