MohanBabu : మంచు మోహన్ బాబుపై కేసు కొట్టివేసిన సుప్రీంకోర్టు:సినిమా నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం గతంలో ధర్నా చేసినందుకు వారిపై రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
సుప్రీంకోర్టులో మోహన్ బాబు, మంచు విష్ణుకు ఊరట
సినిమా నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం గతంలో ధర్నా చేసినందుకు వారిపై రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2019 మార్చి 22న మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు తమ విద్యా సంస్థ శ్రీవిద్యానికేతన్లోని విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ఆందోళన నిర్వహించారు. ఈ నిరసనలో ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నినాదాలు కూడా చేశారు.
కేసు వివరాలు
అప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, మోహన్ బాబు, విష్ణు తదితరుల ఆందోళనతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడిందని ఆరోపిస్తూ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అయితే, తనతో పాటు తన కుమారుడిపై నమోదైన కేసును రద్దు చేయాలని మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఏపీ హైకోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది.
దీంతో మోహన్ బాబు ఈ ఏడాది మార్చి 3న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఎఫ్ఐఆర్, ఛార్జ్షీట్లను పరిశీలించిన తర్వాత, మోహన్ బాబు, ఆయన కుమారుడిపై చేసిన ఆరోపణలు సరిపోవని స్పష్టం చేసింది. అందులో పేర్కొన్న సెక్షన్లు వీరికి ఎలా వర్తిస్తాయో అర్థం కావడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
చివరగా, 2019 మార్చి 23న చంద్రగిరి పీఎస్లో మోహన్ బాబు, ఆయన కుమారుడిపై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Read also:IndiaTrade : ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గవద్దు: శశి థరూర్ – జాతీయ ప్రయోజనాలే ముఖ్యం
