Telangana : రాత్రి ప్రమాదాలకు బ్రేక్: తెలంగాణలో వాహనాలకు రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు తప్పనిసరి

New Road Safety Rule in Telangana: Reflective Stickers Compulsory for All Vehicles
  • రాత్రిపూట ప్రమాదాల నివారణకే ఈ నిర్ణయం

  • బైకులు, ఆటోలు, ట్రాక్టర్లు సహా పాత, కొత్త వాహనాలకు వర్తింపు

  • నాణ్యత తనిఖీకి ప్రత్యేక కమిటీ, క్యూఆర్ కోడ్ విధానం

రాత్రివేళల్లో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాల నుండి భారీ సరుకు రవాణా వాహనాల వరకు అన్ని వాహనాల వెనుక భాగంలో రిఫ్లెక్టివ్ స్టిక్కర్లను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రోడ్డు పక్కన ఆగి ఉన్న లేదా నెమ్మదిగా వెళ్లే వాహనాలు రాత్రిపూట సరిగా కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం అని ప్రభుత్వం తెలిపింది. రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌ ఈ ఆదేశాలు జారీ చేశారు. రాత్రివేళల్లో వాహనం అంచులు స్పష్టంగా కనిపించేలా ఈ స్టిక్కర్లు ఉండాలని ఆయన వివరించారు.

ఈ నిబంధన కింది వాహనాలకు వర్తిస్తుంది:

  • ద్విచక్ర వాహనాలు
  • ఆటోలు
  • ట్రాక్టర్లు
  • మోటార్ క్యాబ్‌లు
  • ఓమ్నీ బస్సులు
  • హైడ్రాలిక్ ట్రాలర్లు

కొత్తగా వచ్చే వాహనాలకు కంపెనీలే ఈ స్టిక్కర్లను ఏర్పాటు చేస్తాయని, పాత వాహనాల యజమానులు తప్పనిసరిగా వాటిని అమర్చుకోవాలని సూచించారు. స్టిక్కర్ల నాణ్యతను పరిశీలించడానికి రవాణా శాఖ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనుంది.

ఉపయోగించే స్టిక్కర్లు, నంబర్ ప్లేట్లు AIS 057, 090, 089 నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. వీటిని తనిఖీ చేయడానికి క్యూఆర్ కోడ్ ఆధారిత వ్యవస్థను కూడా తీసుకురానున్నారు. రవాణా శాఖ ఆమోదం పొందిన సంస్థలు మాత్రమే ఈ స్టిక్కర్లను సరఫరా చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.సురక్షిత ప్రయాణానికి సహకరించాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Read also : Telangana : భారీ వర్షాలకు కొట్టుకుపోయిన మట్టి రోడ్డు, పంట నష్టంతో రైతుల ఆవేదన

Related posts

Leave a Comment