Hyderabad : పెళ్లిళ్ల పేరమ్మలు..మాయల ఫకీర్లు

పెళ్లిళ్ల పేరమ్మలు...మాయల ఫకీర్లు

Hyderabad :ఒళ్లు కదలకుండా.. కూర్చున్న చోట నుంచి అడుగు బయటపెట్టకుండా డబ్బులు సంపాదించాలి అనుకునే వారు మన సమాజంలో పెరిగిపోతున్నారు. డబ్బు సంపాదన కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కడానికి అయినా వెనకాడటం లేదు కొందరు. తాజాగా ఈ కోవకు చెందిస సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

పెళ్లిళ్ల పేరమ్మలు..మాయల ఫకీర్లు

హైదరాబాద్, మే 21
ఒళ్లు కదలకుండా.. కూర్చున్న చోట నుంచి అడుగు బయటపెట్టకుండా డబ్బులు సంపాదించాలి అనుకునే వారు మన సమాజంలో పెరిగిపోతున్నారు. డబ్బు సంపాదన కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కడానికి అయినా వెనకాడటం లేదు కొందరు. తాజాగా ఈ కోవకు చెందిస సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వృద్ధులను టార్గెట్ చేసుకున్న ఇద్దరు మహిళలు నయా దందాకు తెర తీశారు. ఈ క్రమంలో 80 ఏళ్ల వృద్ధుడిని నమ్మించి.. అతడి వద్ద నుంచి సుమారు రూ.1.77 లక్షలు కాజేశారు. మోసపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ కిలేడీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  ఇద్దరు కిలేడీలు వృద్ధులకు పెళ్లి సంబంధాలు చూస్తామంటూ ఆశపెడతారు. నమ్మి వీరితో మాట కలిపితే లక్షలు కాజేస్తారు. 80 ఏళ్ల వృద్ధుడి ఫిర్యాదుతో ఈ పెళ్లిళ్ల పేరమ్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన కటారు తాయరమ్మ అలియాస్ సరస్వతి.. కొంత కాలం నుంచి హైదరాబాద్, దిల్‌సుఖ్‌నగర్‌లోని పీఅండ్‌టీ కాలనీలో నివాసం ఉంటుంది. మరో మహిళ ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన కూనపరెడ్డి స్వాతి. ప్రస్తుతం ఈమె మల్కాజిగిరిలోని సత్యనాగేంద్ర కాలనీలో నివాసం ఉంటుంది.

దీనికన్నా ముందు స్వాతి కూడా పీఅండ్‌టీ కాలనీలోనే ఉండేది. ఈ సమయంలోనే స్వాతి, సరస్వతిలకు పరిచయం ఏర్పడిందిఅప్పటికే వీరు ఇద్దరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. భర్తల సంపాదన కుటుంబ అవసరాలకు సరిపోవడం లేదు. దీంతో వారిద్దరూ ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలని భావించారు. ఇందుకోసం ఓ ప్లాన్ వేసుకున్నారు. దీనిలో భాగంగా ఓ మ్యారేజ్ బ్యూరో ప్రారంభించారు. వ‌ృద్ధులకు పెళ్లి సంబంధాలు కుదుర్చుతామంటూ ప్రచారం చేసుకున్నారు. దీని గురించి కొన్ని పేపర్లలో యాడ్స్ కూడా ఇచ్చారు.ప్రకటన చూసిన ఖమ్మం జిల్లా మధిర జామాపురానికి చెందిన ఇరుకుమాటి చిన్నకొండయ్య (80) అనే వృద్ధుడు.. గతేడాది అక్టోబర్‌లో రెండో పెళ్లి కోసం వీరిని సంప్రదించాడు. పదేళ్ల క్రితం చిన్నకొండయ్య భార్య మరణించింది. అప్పటి నుంచి అతడు ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్నాడు. గతంలో అతడు ధర్మహోమియో మెడికల్‌ ప్రాక్టిషనర్‌గా పనిచేసేవాడు. వృద్ధాశ్రమంలో ఉండటం కష్టంగా ఉండటంతో.. తోడు మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.

అదే సమయంలో కిలేడీలు ఇచ్చిన ప్రకటన ఇతడి కంట పడింది.పెళ్లి ప్రకటన చూసిన చిన్నకొండయ్య.. స్వాతి, సరస్వతిని ఫోన్‌లో సంప్రదించాడు. వారు ఓ సంబంధం ఉందని.. వివరాలు కావాలంటే హైదరాబాద్‌కు రావాలని తెలిపారు. దీంతో నిజంగానే పెళ్లి సంబంధం చూపిస్తారనే ఆశతో.. కొండయ్య హైదరాబాద్ వచ్చాడు. రెండు రోజుల పాటు పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఈ ఇద్దరు కిలేడీలు ఆయన్ని సికింద్రాబాద్‌లోని ఓ షోరూంకు తీసుకెళ్లి చీరలు, సారెలు అంటూ పలు రకాల వస్తువులు, బట్టలు భారీగా కొనిపించారు.మళ్లీ కలుస్తామని చెప్పి.. వాటిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆతర్వాత చిన్నకొండయ్య.. ఆ మహిళలకు ఫోన్‌చేయగా వారు స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి సంబంధం పేరుతో.. సదరు మహిళలు తన వద్ద నుంచి రూ.1.77 లక్షలు కాజేశారని తెలిపాడు. చిన్నకొండయ్య ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ మహంకాళి పోలీసులు తాజాగా ఈ ఇద్దరు మహిళలను అరెస్ట్‌ చేశారు.

Read more:Hyderabad : కబ్జాలపై కుప్పలు, తెప్పలుగా ఫిర్యాదులు

Related posts

Leave a Comment