Telangana : జేఎన్టీయూలో ప్రొఫెసర్ తప్పిదం: వందలాది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం:జవాబుపత్రాలు దిద్దడంలో ఓ ప్రొఫెసర్ చేసిన చిన్న పొరపాటు కారణంగా ఏకంగా 138 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అయితే, ఒక విద్యార్థి ద్వారా ఈ పొరపాటును గుర్తించిన అధికారులు వెంటనే సరిదిద్ది, సరికొత్త ఫలితాలను ప్రకటించారు. దీంతో ఫెయిల్ అయిన విద్యార్థులందరూ పాస్ అయ్యారు.
ప్రొఫెసర్ పొరపాటు: 138 మంది విద్యార్థులు ఫెయిల్, ఆపై పాస్!
జవాబుపత్రాలు దిద్దడంలో ఓ ప్రొఫెసర్ చేసిన చిన్న పొరపాటు కారణంగా ఏకంగా 138 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అయితే, ఒక విద్యార్థి ద్వారా ఈ పొరపాటును గుర్తించిన అధికారులు వెంటనే సరిదిద్ది, సరికొత్త ఫలితాలను ప్రకటించారు. దీంతో ఫెయిల్ అయిన విద్యార్థులందరూ పాస్ అయ్యారు.
అసలేం జరిగిందంటే..!
గత నెలలో జేఎన్టీయూ నాలుగో ఏడాది రెండో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (EIA) సబ్జెక్టు పరీక్షకు హాజరైన మల్లారెడ్డి, షాదన్, శ్రీదత్త కళాశాలలకు చెందిన సుమారు 138 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీనిపై శ్రీదత్త కాలేజీకి చెందిన ఓ విద్యార్థి అనుమానం వ్యక్తం చేస్తూ, EIA సబ్జెక్టులో ఇంతమంది ఫెయిల్ అయ్యే అవకాశం లేదని, ఫలితాలను మరోసారి తనిఖీ చేయాలని జేఎన్టీయూ పరీక్షల విభాగం అధికారులకు మెయిల్ చేశాడు.
విద్యార్థి అభ్యర్థన మేరకు అధికారులు ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబుపత్రాలను మరోసారి పరిశీలించారు. ఈ క్రమంలో, వారి జవాబుపత్రాలను దిద్దిన ప్రొఫెసర్ పొరపాటు చేసినట్లు గుర్తించారు. పరీక్ష ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో వేర్వేరు ప్రశ్నపత్రాలతో నిర్వహించారు. అయితే, ప్రొఫెసర్ ఉదయం ప్రశ్నపత్రంతోనే సాయంత్రం జవాబు పత్రాలను కూడా దిద్దినట్లు తేలింది. వెంటనే సాయంత్రం ప్రశ్నపత్రంతో జవాబు పత్రాలను తిరిగి దిద్దించగా, ఫెయిల్ అయిన విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యారు. గురువారం రాత్రి అధికారులు సవరించిన ఫలితాలను ప్రకటించారు.
