-
ఆదిలాబాద్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన
-
కుక్కల దాడి భయంతో ఇంటి పైకప్పు ఎక్కిన ఎద్దు
-
తాళ్ల సహాయంతో సురక్షితంగా కిందకు దించిన స్థానికులు
ఆదిలాబాద్ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు ఓ ఎద్దు ఏకంగా ఓ ఇంటి పైకప్పుపైకి ఎక్కింది. ఈ ఘటన భోరజ్ మండలం నిరాల గ్రామంలో జరిగింది. నిరాల గ్రామానికి చెందిన రైతు షేక్ గఫూర్ తన ఎద్దును ఇంటి ఆరుబయట కట్టేశాడు. ఆదివారం ఉదయం కొన్ని వీధికుక్కలు ఆ ఎద్దుపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి. వాటిని చూసి భయపడిన ఎద్దు, తన కట్టు తాళ్లను తెంచుకుని పరుగులు తీసింది. కుక్కల నుంచి తప్పించుకునే క్రమంలో, పక్కనే ఉన్న రాళ్లపైకి ఎక్కి, అక్కడి నుంచి ఇంటి పైకప్పు మీదకు దూకింది.
ఇంటి పైకప్పుపై ఎద్దును చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటనలో విఠల్ మాస్టర్ అనే వ్యక్తి ఇంటి పైకప్పు కొంత దెబ్బతింది. గ్రామస్థులు వెంటనే అక్కడికి చేరుకుని, తాడు సాయంతో ఎద్దును క్షేమంగా కిందికి దించారు. ఈ అరుదైన ఘటనను చూసిన స్థానికులు తమ ఫోన్లలో వీడియోలు తీశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read also : HoneyTrap : హనీట్రాప్ ముఠా గుట్టు రట్టు: యోగా గురువును టార్గెట్ చేసిన హనీట్రాప్ ముఠా
