రెండు రాష్ట్రాలలో కూడా ఏడాది లోపే ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో ఎన్నికలకు ఇంకా పదినెలల సమయముండగా.. తెలంగాణలో మాత్రం ఆరు నెలలు మాత్రమే ఉంది. దీంతో రోజులు గడిచే కొద్దీ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే ముందుగా గుర్తిచ్చేది పొత్తులు, సీట్ల పంపకాలు, అధికార భాగస్వామ్యం. ఇవన్నీ కుదిరితేనే పొత్తులు ఖరారై ఉమ్మడి కార్యాచరణ మొదలవుతుంది. అప్పటి నుండే అసలు సిసలైన యుద్ధం మొదలవుతుంది. అందుకే పొత్తుల అంశాలను ప్రధాన పార్టీలు కనీసం ఎన్నికలకు ఆరు నెలల ముందే నిర్ధారించుకుంటుంటారు.
తెలంగాణలో గద్దర్ కొత్త పార్టీ..
ఆ లెక్కన చూస్తే తెలుగు రాష్ట్రాలలో కూడా పొత్తుల చర్చలకు సమయం ఆసన్నమైంది.ఏపీలో పొత్తులకు కాస్త సమయం ఉన్నా.. తెలంగాణలో మాత్రం వీలైనంత త్వరగా తేల్చేయాల్సి ఉంది. అయితే, ఒక రాష్ట్రంతో మరొక రాష్ట్రానికి రాజకీయ సంబంధాలు ఉండడంతో సహజంగానే ఈ పొత్తుల అంశం రెండు రాష్ట్రాలకి సంబంధించినదిగా చూడాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే వచ్చే నెలలో ఈ పొత్తుల అంశంలో తెలుగు రాష్ట్రాలకి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకొనే ఛాన్స్ కనిపిస్తుంది. ఏపీలో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ-జనసేన ప్రజల మధ్యకి వెళ్లి ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాయి.
టీడీపీ నుండి లోకేష్ పాదయాత్రలో నిమగ్నమవగా.. జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహీతో బస్సు యాత్ర మొదలు పెట్టారు. ఇది కాకుండా టీడీపీ మ్యానిఫెస్టోతో బస్సు యాత్రకు సన్నాహాలు చేసుకుంటోంది. మరి మ్యానిఫెస్టో అంటే పొత్తులు కూడా తేల్చాలి కదా. పొత్తులతో ఎన్నికలు అంటే మ్యానిఫెస్టో కూడా ఉమ్మడిగానే ఉంటుంది కనుక ఈ యాత్రలోగా ఈ పొత్తులను తేల్చేయాల్సి ఉంది. పైగా ఏపీలో టీడీపీతో పొత్తు అంటే ఎంతో కొంత అది తెలంగాణలో కూడా కచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఆ విధంగా చూసినా వచ్చే నెలలో ఈ పొత్తుల వ్యవహారం తేల్చేయాల్సి ఉంది.టీడీపీ-జనసేన-బీజేపీ ఎవరికి వారి ఎత్తులు పై ఎత్తులు ఉన్నా.. ఈసారి కలిసి వెళ్లడమే ఖాయంగా కనిపిస్తుంది.
ఒకవైపు పవన్ బీజేపీతో పొత్తులో ఉంటూనే టీడీపీకి సిగ్నల్ ఇచ్చేశారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీల్చేందుకు సిద్ధంగా లేనని స్పష్టత ఇచ్చేశారు. పాత స్నేహితులకు మరోసారి స్నేహ హస్తం అందించాలని బీజేపీ అధిష్టానం కూడా సంకేతాలు ఇస్తోంది. ఈ లెక్కన చూస్తే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఖాయమయ్యే అవకాశమే ఎక్కువగా ఉన్నాయి. అయితే, తెలంగాణలో ఆరు నెలలే సమయం ఉండడంతో పొత్తు ఉంటుందా? ఉండదా అనేది తేల్చేయడం బీజేపీకి ఇప్పుడు చాలా అవసరం. ఈ క్రమంలోనే పొత్తులు పెట్టుకునే విషయంలో బీజేపీ ఇప్పుడు కూడా క్లారిటి ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోవటం ఖాయం.
ఆర్ధిక రాజధానిపై గులాబీ ఫోకస్.
అందుకనే టీడీపీతో పొత్తు విషయంలో వచ్చే నెలలో బీజేపీ ఫైనల్ డెసిషన్ తీసుకోబోతోందని సమాచారం. అన్నీ అనుకున్నట్లే జరిగితే వచ్చేనెలలో నరేంద్రమోడీ లేదా అమిత్ షా మరోసారి చంద్రబాబుతో భేటీ అవుతారు. అప్పుడు పొత్తులపై క్లారిటీ వచ్చేస్తుందని భావిస్తున్నారు. ముందుగా ఢిల్లీలో భేటీ అనంతరం టీడీపీ, బీజేపీ, జనసేన సంయుక్తంగా సమావేశమై ఉమ్మడి ప్రణాళికను రెడీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో ఈ కూటమి తెలంగాణలో ఎలా పనిచేయనుంది? అసలు ఇక్కడ కలిసే పోటీ చేస్తారా? లేక ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రణాళికలు అమలు చేస్తారా అనేది చూడాల్సి ఉంది.