భారీ వర్షాల దృష్ట్యా సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గం అత్యవసర సమావేశం
Emergency meeting of Sirisilla Municipal Governing Body in view of heavy rains
సిరిసిల్ల పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి ఆధ్వర్యంలో భారీ వర్షాల దృష్ట్యా అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ సిరిసిల్ల పురపాలక సంఘ పరిధిలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పట్టణంలో లోతట్టు ప్రాంతాలలో వరదలు వచ్చి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని, అందుకుగాను మంత్రి కె తారక రామారావు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకొనుట గురించి, అదే విధంగా రాబోవు భారీ వర్షాల దృష్ట్యా ముందస్తు చర్యలను చేయుటకు తగిన ప్రణాళికలను సిద్ధం చేయుట గురించి పాలకవర్గ సభ్యులతో మాట్లాడి తగు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని అన్నారు. పట్టణంలో వారం రోజులపాటు భారీగా కురిసిన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలలో పలుచోట్ల మట్టి రోడ్లు చెడిపోవడం, రోడ్లపై బురద పేరుకుపోవడం మొదలగు సానిటేషన్ సమస్యలు తలెత్తగా అందుకు గాను పాలకవర్గ సభ్యులతో చర్చించి నిధులను కేటాయించుకోవడం జరిగిందని అన్నారు. ఈ ప్రత్యేక సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.