- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం..
- అతలాకుతలం అయిన జనం..
- పెద్దంపల్లిలో ఇళ్లలోకి చేరిన వరద నీరు..
- మత్తల్లు పోస్తున్న చెరువులు..
- పొంగి ప్రవహిస్తున్న వాగులు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం రాత్రి నుండి మంగళవారం వరకు భారీ వర్షం కురిసింది. కురిసిన వర్షానికి వరదలు ముంచెత్తాయి. ఇళ్లలోకి వరద నీరు వచ్చి జనం అతలాకుతలం అయ్యారు. టేకుమట్ల మండలం పెద్దంపల్లిలో ఎస్సీ కాలనీలోకి భారీగా వరద నీరు చేరడంతో బాధిత కుటుంబాలు నానా అవస్థలు పడ్డారు. వరదనీటికి చెరువులు నిండుకుండలా మారి మత్తల్లు పోస్తున్నాయి. వాగులు పొంగి ప్రవహిస్తూ జలకలను సంతరించుకున్నాయి. జిల్లాలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయి. ముఖ్యంగా టేకుమట్ల మండలంలోని పెద్దపల్లిలో వరద బీభత్సం సృష్టించింది. గత మూడు నాలుగు రోజుల నుండి వరుసగా వర్షాలు పడుతుండడంతో టేకుమట్ల మండలం వెలిశాల గుట్టల నుండి భారీగా వరద నీరు రావడంతో పెద్దంపల్లి గ్రామంలోని ఎస్సీకాలని ముంపుకు గురైంది.
గ్రామశివారు లోని ఒర్రే నుండి వెలిశాల చెరువులోకి వెళ్లాల్సిన వరద నీరు ఎస్సీ కాలనీలోకి వెళ్ళింది. దీంతో ఇళ్ళలోకి నీళ్లు చేరడంతో కాలనీవాసులు నానా ఇబ్బందులు పడ్డారు. అధికారుల ముందు చూపు కొరవడంతో వరద నీరు ఇళ్లలోకి చేరుకుందని కాలనీవాసులు చెబుతున్నారు. అదేవిధంగా వరదల తాకిడికి ఇదే గ్రామానికి చెందిన చందు అనే రైతు పత్తి చేను మొత్తం ధ్వంసమై పోవడంతో బాధిత రైతు ఆందోళన చెందుతున్నాడు. వర్షాల కారణంగా ఆశిరెడ్డిపల్లి, వెలిశాల ప్రాథమిక పాఠశాలల్లోకి భారీగా వరద నీరు చేరి, అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో తగిన చర్యలు చేపట్టాలని సర్కారు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ, శిథిలావస్థకు చేరిన ఇళ్లను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పినప్పటికీ సంబంధిత అధికారులు ఆవైపు చర్యలు చేపట్టలేదు.
నిండుతున్న చెరువులు..
పొంగుతున్న వాగులు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చెరువులు నిండుతున్నాయి. వాగులు పొంగుతున్నాయి. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో వరద నీటితో చెరువులు జలకలను సంతరించుకొని నిండుకుండలా మారాయి. ఆయా గ్రామాల్లో మత్తల్లు కూడా పోస్తున్నాయి. చిట్యాల మండలం నవాబుపేట, టేకుమట్ల శివారు చలివాగులు, గర్మిళ్లపల్లి శివారు మానేరు వాగు లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
సహాయక చర్యలు చేపట్టిన ఎస్సై..
టేకుమట్ల మండలంలోని పెద్దపల్లి ఎస్సీ కాలనీ వరద ముంపుకు గురికావడంతో ఎస్సై చల్లా రాజు సహాయక చర్యలు చేపట్టారు. కాలనీని సందర్శించి బాధితుల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. చివరికి జేసీబీ సహాయంతో వరద నీరు వెలిశాల చెరువులోకి వెళ్లే విధంగా తవ్వకాలు చేపట్టి ఇబ్బ ఇబ్బందులు లేకుండా చేశారు. సహాయక చర్యలు చేపట్టిన ఎస్సైకి కాలనీవాసులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.