- చిల్లర రాకీయాలకు భయపడను
- సీఎం సర్వేలో జనగామ టాప్ 10లో ఉంది
- కేసీఆరే స్వయంగా నాకు ఫోన్ చేసి చెప్పిండు: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
‘తెలంగాణ ఉద్యమ సమయంలో, 2014 ఎన్నికల టైంలో ఎన్నో చిల్లర రాజకీయాలు చూసినం.. ఇప్పుడు కూడా కొందరు అవే చేస్తున్నరు.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నేను భయపడేది లేదు.. బాధపడేది లేదు..’ అంటూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హాట్ కామెంట్ చేశారు. జనగామ టికెట్ విషయంలో ముత్తిరెడ్డి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలను ఆయన కొట్టిపారేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన బీసీ కుల వృత్తుల రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ సర్కారు ముచ్చటగా మూడోసారి కూడా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇక తనకు టికెట్ రాదని కొందరు చేస్తున్న చిల్లర రాజకీయాలకు భయపడొద్దని సీఎం కేసీఆరే తనకు స్వయంగా ఫోన్ చేశారని చెప్పారని ఆయన తెలిపారు. సీఎం చేపట్టిన సర్వేలో జనగామ టాప్ టెన్లో ఉందన్నారు. 2014 ఎన్నికల సమయంలో కూడా కొందరు కుట్రలు, కుతంత్రాలు చేశారని కానీ ప్రజలు తనను ఆశీర్వదించారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా టికెట్ విషయంలో వస్తున్న గాలి వార్తలను సీఎం కొట్టిపారేశారన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జనగామలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేది.. గెలిచేది తానేనని ముత్తిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
300 మందికి బీసీ ఆర్థిక సాయం..
తెలంగాణ సర్కారు కొత్తగా ప్రవేశపెట్టిన బీసీ కుల వృత్తుల రూ.లక్ష ఆర్థిక సాయం పథకానికి జిల్లా నుంచి 5,258 మంది దరఖాస్తు చేసుకున్నట్టు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వివరించారు. ఇందులో 3,684 మందిని అధికారులు అర్హులుగా గుర్తించారని, అందులో తొలి విడతగా 300 మందికి ఆర్థిక సాయం చెక్కులను అందజేస్తున్నట్టు చెప్పారు. మిగతా వారి దరఖాస్తులను కూడా పరిశీలించాలని అధికారులకు సూచించారు. రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ సాయం అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పుష్పాభిషేకం చేశారు. కార్యక్రమంలో జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, ఎంపీపీ మేకల కలింగరాజు, జడ్పీటీసీ దీపిక మహేందర్రెడ్డి, కౌన్సిలర్లు బండ పద్మ, ఎం.డి సమద్, పేర్ని స్వరూప, మల్లిగారి చంద్రకళ రాజు, వాంకుడోతు అనిత, పాండు తదితరులు పాల్గొన్నారు.