- ఉత్తర తెలంగాణలో భారీ వానలు
- ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం
- కలెక్టర్లను అప్రమత్తం చేసిన ప్రభుత్వం
రాష్ట్రంలో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలో భారీ వానలు ఉంటాయని హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాయవ్య బంగాళాఖతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్ , ఉత్తర ఒడిశా తీరాలలో కొనసాగుతున్నదని వివరించింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రాగల రెండుమూడు రోజులలో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్ గఢ్ మీదుగా వెళ్ళే అవకాశం ఉందని పేర్కొంది.
దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ, వాయవ్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నాయని తెలిపింది. శుక్రవారం రాత్రి నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆయా జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు. శనివారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.