కోటిలింగాల పార్వతీ కోటేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణకు ప్రభుత్వం ముందుకొచ్చింది. క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం నుండి క్రీస్తు శకం రెండవ శతాబ్దం వరకు శాతవాహనులు సుమారు 400 సంవత్సరాలు కోటిలింగాలను తొలి రాజధానిగా చేసుకొని పరిపాలించిన విషయం చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిఉంది. భారతదేశంలోని 30 బలిష్టమైన కోటదుర్గాలలో ఒకటి కోటిలింగాలలో ఉందని మెగస్తనీస్ తాను రాసిన ఇండికా గ్రంథంలో పేర్కొనడం విశేషం. అలనాటి శాతవాహనులు నిర్మించిన కోట దుర్గంలో ఈశాన్యం వైపున గోదావరి తీర ప్రాంతంలో ఉన్న కోట బురుజుపై కోటేశ్వర స్వామి ఆలయం నిర్మించబడి ఉంది.
దీనిని శాతవాహనులు నిర్మించారా వారి తదనంతరం ఎవరు నిర్మించారో చరిత్రకు అందని విషయం. ఇంత గొప్ప పురాతన శివాలయాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకు రావడం సంతోషకరం. కాళేశ్వరం లింక్ టు ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ చేపట్టిన మెగా కంపెనీ వారిచే ఆలయ పునర్నిర్మాణ పనులు చేయించడానికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మెగా కంపెనీ కోటేశ్వర స్వామి ఆలయాన్ని పూర్తిగా విస్తరించి రాజగోపురం, ప్రాకారం నిర్మించి త్రికూట ఆలయం మాదిరిగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ఆలయ మాజీ చైర్మన్ మధుర నారాయణరావు కాంత్ రెడ్డి పర్యవేక్షణలో ఏర్పాటు చేస్తున్నారు.
ఆలయ ప్రాముఖ్యతపై చారిత్రక నేపథ్యం పురాణ కథలు
ఆనాడు శాతవాహనులు నిర్మించిన కోట దుర్గంలోని ఈశాన్య కోట బురుజు పై శివాలయాన్ని నిర్మించారు. కోటపై శివాలయాన్ని నిర్మించడం వలన ఇది కోట లింగముగా పిలిచేవారు. కాల గమనంలో కోటేశ్వర స్వామి ఆలయంగా మార్పు చెందినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. మరో పురాణ కథ వినికిడిలో ఉంది. పూర్వకాలంలో కోటిలింగాలకు ఆగ్నేయ దిశలో ఉన్న మునుల గుట్టపై ఉన్న గుహలో మునులు నివాసం ఉండేవారు. వారు నిత్యం గోదావరి చేరుకొని పుణ్యస్నానాలు చేసి అక్కడే తపస్సు చేసుకుని తిరిగి మునుల గుట్టకు వెళ్లేవారు. ఈ క్రమంలో తపస్సు కోసం వారికి దూరాభారం అవుతున్నందున గోదావరి తీరంలోనే ఒక ఆలయాన్ని నిర్మించాలని ఆలోచనకు వచ్చారు. దీంతో రాత్రికి రాత్రే అక్కడ కోటేశ్వర స్వామి ఆలయాన్ని మునులు నిర్మించారు.
సుగాలీ కాలనీలోని మురుగు వెళ్లే దారేది ?
ఈ ఆలయంలో లింగాన్ని ప్రతిష్టించడానికి ఆంజనేయుడిని కాశీకి పురమాయించగా ఆంజనేయుడు లింగం తెచ్చేటప్పటికి తెల్లవారి పోతుందని భావించి మునులు కోటి ఇసుక రేణువులతో సైకత లింగాన్ని ఏర్పాటు చేసి గర్భగుడిలో ప్రతిష్టించారు. ఆంజనేయుడు తెచ్చిన లింగం కోపంతో బయట విసిరేయగా ఇప్పటికీ వరండాలోనే పూజలు అందుకుంటుంది. ఇప్పటికి కోటేశ్వర స్వామి ఆలయ గర్భగుడిలో సైకత లింగమే నిత్య పూజలు అందుకోవడం విశేషం.
ఈ క్రమంలోనే ఈ ప్రదేశానికి కోటిలింగాలుగా పేరు వచ్చిందని పురాణ కథ ద్వారా తెలుస్తుంది. అప్పటి నుంచి కోటేశ్వర స్వామి భక్తులకు కోరిముక్కితే కొంగు బంగారమై నిలుస్తూ కోరికలను నెరవేరుస్తూ నిత్య పూజలు అందుకుంటున్నారు.
పవిత్ర గోదావరి తీరంలో ఉన్న ఈ ప్రాచీన శివాలయం అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలోనే ఉండటం విశేషం. తెలంగాణ ఏర్పాటు తర్వాత దశాబ్దానికైనా కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయం పై ప్రభుత్వానికి గుర్తు రావడం గొప్ప విషయమని ఈ ప్రాంత వాసులు అభిప్రాయ పడుతున్నారు. రూ.3.5 కోట్లతో అభివృద్ధి పనులు రూ.3.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఆలయ అధికారుల సహకారంతో మెగా కంపెనీ వారు శ్రీకారం చుట్టారు. కోటేశ్వర స్వామి ఆలయాన్ని పూర్తిగా విస్తరించడానికి ఆలయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కోటేశ్వర సిద్దేశ్వర స్వామి లింగములకు ఎలాంటి స్థానచలనం జరగకుండా మిగతా ఆలయాన్ని పూర్తిగా జీర్ణోద్ధరణ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.
త్రికూటాలయం మాదిరిగా కోటేశ్వర స్వామి ఆలయం
దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి త్రికూటాలయం మాదిరిగా శ్రీ కోటేశ్వర స్వామి ఆలయాన్ని మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. కోటేశ్వర స్వామి గర్భగుడిలోని సైకత లింగము మధ్యలో కుడివైపున సిద్దేశ్వర స్వామి ఎడమ వైపున కాశి లింగం ఉండే విధంగా ఆలయాన్ని పునర్నిర్మానం చేయబోతు న్నారు. రూ.1.కోటి తో ఆలయానికి ఐదంతస్తుల రాజగోపురం, రూ.1.5 కోట్లతో విస్తరణ పనులు, మండపం నిర్మాణం, రూ.1.5 కోట్లతో ఆలయం చుట్టూరా ప్రాకారం నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఈవో కాంత రెడ్డి వెల్లడించారు.
మరో వారం రోజుల్లో ఆలయ జీర్ణోద్ధరణ పనులు మొదలు కానున్నాయి.
అరకు కాఫీకి ఇంటర్నేషనల్ బ్రాండ్..
పనులు జరుగుతున్న…
ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించిన భక్తులకు శివపార్వతుల దర్శనం యధావిధిగా జరిగే విధంగా ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రధాన ఆలయంలోని కోటేశ్వర స్వామి లింగము, అమ్మవారు పార్వతీదేవి గణపతి కాశి లింగముల ప్రశస్తిని వేద పండితుల ద్వారా ఆలయం పరిసరాలలో నిర్మించిన బాలఆలయంలోకి మారుస్తామని అర్చకులు తెలిపారు. బాలాలయంలో ఉత్సవ విగ్రహాల సమక్షంలో భక్తులకు దర్శనాలు. నిత్య పూజలు కైంకర్యాలు యధావిధిగా జరుగుతాయన్నారు.
ఏడాదిలోగా సర్వదర్శనానికి సిద్ధం: కోటిలింగాలలోని కోటేశ్వర స్వామి ఆలయం త్రికూట ఆలయం మాదిరిగా రూపాంతరం చెంది అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకొని ఏడాదిలోగా భక్తులకు సర్వదర్శనానికి సిద్ధం కాబోతోంది. ఆలయ అధికారులు మెగా కంపెనీ అధికారులు సాయిల్ టెస్ట్ కోసం మట్టి నమూనాలను సేకరించి తీసుకెళ్లారు. ఏడాదిలోగా భక్తులు దర్శనానికి సిద్ధం చేస్తామని మెగా కంపెనీ అధికారి రవీందర్ తెలిపారు.