- దేశంలోనే అత్యుత్తమ వైద్యసేవలు
- 216 ఎకరాల్లో భవనం
- వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు
ముద్ర ప్రతినిధి, వరంగల్: వరంగల్ హెల్త్ సిటీ చారిత్రాత్మక భవనం, రాష్ట్రానికే కాదు దేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు ఇక్కడ అందబోతున్నాయని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. 216ఎకరాల్లో ఈహెల్త్ సిటీ రూపుదిద్దుకుంటోందని, అవయవమార్పిడి ఆపరేషన్లు సైతం వరంగల్ లో అందుబాటులోకి రాబోతున్నాయని, హైదరాబాద్ తర్వాత వరంగల్ ను అంతగా అభివృద్ధి చేయాలని సీఎం భావిస్తున్నారని మంత్రి స్పష్టం చేసారు. శనివారం వరంగల్ కు వచ్చిన ఆయన హెల్త్ సిటీ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మీడియాల్లో మాట్లాడారు. వరంగల్ తో పాటు, ఉత్తర తెలంగాణ ప్రజల కోసం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ 2000 పడకల ఆసుపత్రికి శ్రీకారం చుట్టారన్నారు. నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని, 2023 చివరి నాటికి భవనం పూర్తి అవుతుందన్నారు. దసరా నాటికే పూర్తి అయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బి, ఏజెన్సీ, వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాజకీయాల కోసం కొందరు విమర్శలు చేస్తారని, గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా విమర్శలు చేశారు.
వాళ్లు ఇవాళ నోరెళ్లబెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నేను రానుబిడ్డో సర్కారు దవాఖనకు అనే వారు…ఇప్పుడు నేను పోత బిడ్డో సర్కార్ దవాఖానాకు అంటున్నారన్నారు. ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ నెంబర్ వన్ పొజిషన్, పీజీ సీట్లలో రెండో స్థానంలో ఉందన్నారు. మెడికల్ చదువు కోసం మన పిల్లలు ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కృషి చేస్తున్నామన్నారు. సమైక్య రాష్ట్రంలో మెడికల్ విద్యలో వెనకబడ్డామని, తెలంగాణలో మంచి పథకాలు అమలు చేస్తున్నారని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు చెబుతున్నారని అన్నారు. ఢిల్లీలో, పంజాబ్ లో కంటి వెలుగు ప్రారంభిస్తామని ప్రకటించినట్లు వివరించారు. కేంద్రం ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందన్నారు. కాళేశ్వరం స్ఫూర్తితో వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామన్నారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఉన్నారు.