న్యూ డిల్లీ అక్టోబర్ 7
ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పతకాల పట్టికలో తొలిసారిగా వంద మార్కును అందుకున్నది. శనివారం ఉదయం ఆర్చరీలో రెండు స్వర్ణాలు సహా నాలుగు పతకాలు, మహిళల కబడ్డీలో గోల్డ్ మెడల్ లభించడంతో ఈ ఘనత సాధించింది. దీంతో 25 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్యాలతో పతకాల పట్టికలో టీమ్ఇండియా ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్నది.మహిళల కబడ్డీ ఫైనల్లో భారత్ 26-25తో చైనీస్ తైపీని మట్టికరిపించింది. దీంతో టీమ్ఇండియా స్వర్ణం చేజిక్కించుకుంది. అంతకుముందు ఆర్చరీలో ఇండియాకు నాలుగు పతకాలు లభించాయి. ఆర్చరీ మహిళల కాంపౌండ్ సింగిల్స్లో జ్యోతి సురేఖ స్వర్ణం సాధించగా, అదితి గోపీచంద్ కాంస్యం గెలుపొందింది. ఇక ఆర్చరీ పురుషుల కాంపౌండ్ సింగిల్స్లో ఓజాస్ ప్రవీణ్ డియోటలేకు స్వర్ణం లభించగా, అభిషేక్ వర్మ సిల్వర్ సొంతం చేసుకున్నాడు. ఆసియా క్రీడల్లో ఓజాస్కు ఇది మూడో బంగారు పతకం కావడం విశేషం.పతకాల పట్టికలో 354 మెడల్స్తో చైనా అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఇందులో 187 స్వర్ణాలు, 104 రజతం, 63 కాంస్యాలు ఉన్నాయి. 169 మెడల్స్తో జపాన్ (47 గోల్డ్, 57 సిల్వర్, 65 బ్రోన్జ్), 171 పతకాలతో కొరియా (36 స్వర్ణం, 50 రజతం, 85 కాంస్యం), 100 మెడల్స్తో భారత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Prev Post
Next Post