డియర్ సీఎంగారు… ఇప్పుడు ఉద్యోగామా….
హార్ట్ టచింగ్ లెటర్ రాసిన నళిని
హైదరాబాద్, డిసెంబర్ 18,
దోమకొండ నళిని… ఈ పేరు కొంత మందికే తెలుసు.. కానీ డీఎస్పీ నళిని అంటే మాత్రం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మూడు కోట్ల తెలంగాణ ప్రజలకు సుపరిచితం. స్వరాష్ట్రం కోసం ఉద్యోగాన్ని గడ్డిపోచలా వదిలేసిన ఉద్యమకారిణి. తెలంగాణ ఉద్యమ సమయంలో తనవారిపై లాఠీ ఝళిపించలేదె.. మా రాష్ట్రం మాకు కావాలని ఉద్యమిస్తున్న యువకుల గుండెలపై తుపాకీ గురిపెట్టలేక.. ఇటు అధికారుల ఒత్తిడి తట్టుకోలేక.. కష్టపడి సాధించిన కొలువును తీసి అవల పడేసింది. తెలంగాణ ఉద్యమ పార్టీగా స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత టీఆర్ఎస్(ఇప్పుడు బీఆర్ఎస్)కు 2014లో ప్రజలు పట్టం కట్టారు. ఉద్యమకారును ఆదుకుంటామని చెప్పిన నాటి సీఎం కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఉద్యమకారులకు న్యాయం చేయలేకపోయారు. పోలీస్ కిష్టయ్య బిడ్డను డాక్టర్ చదివించామని గొప్పలు చెప్పుకుంటున్న గులాబీ నేతలు.. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన ఇంకా 600 మందిని గుర్తించలేదు. ఇక ఉద్యోగాన్ని వదిలేసిన డీఎస్పీ నళిని, తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లికి కనీసం గౌరవం ఇవ్వలేదు. పదేళ్లు గడిచాయి. ప్రభుత్వాన్ని మార్చేశారు ప్రజలు. ఈ నేపథ్యంలో నళిని అంశం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఉద్యోగం ఇవ్వాలని కొత్త సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కానీ, కొలువును నళిని సున్నితంగా, వినమ్రంగా తిరస్కరించారు.
ఈమేరకు సీఎంకు రాసిన లేఖ.. గుండెను హత్తుకునేలా ఉంది.గౌరవ నీయులైన ముఖ్యమంత్రి గారికి..! మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళుల చెమ్మగిల్లుతున్నాయి. మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించింది. ఈ నేపథ్యంలో గతం ఒక రీల్లా నా కళ్ల ముందు కదులుతుంది. ఇన్నాళ్లు నేను ఒక సస్పెండెడ్ ఆఫీసర్గా ‘సోషల్ స్టిగ్మా (మరక) ’ను మోసాను. నన్ను ఆనాటి ప్రభుత్వం 3 ఏళ్లు చాలా ఇబ్బంది పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణక్షణం ఒక గండంలా గడిచింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు, 2009, డిసెంబర్ 9 న నేను చేసిన రాజీనామా చాలా సంచలనం రేకెత్తించింది. అదే రాత్రి చిదంబరం గారు చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది. నాటి సీఎం రోశయ్య గారు మహిళా దినోత్సవం రోజున నాకు నా ఉద్యోగాన్ని కానుకగా తిరిగి ఇస్తున్నట్లు ప్రకటిస్తే, నేను రాజీనామాను విత్ డ్రా చేసుకొని డిపార్ట్మెంట్లో చేరాను. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే. 18 నెలలు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు నేను ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలు నాకు బ్యురోక్రసిపైనే నమ్మకం పోయేలా చేశాయి. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో పోస్టింగ్ ఇచ్చి, నాకు ఛార్జ్ మెమోలు ఇచ్చి వివరణ కోరడం, ఎక్స్ప్లనేష¯Œ ్స రాయమనడం, రిమార్క్ రాయడం, బ్యాచ్లో నా ఒక్క దానికే ప్రమోషనన్ను ఆపేయడం, ప్రోబేషన్ పీరియడ్ ఎక్సె్టండ్ చేయడంవంటివి చేశారు. నన్ను ఒంటరిని చేసి ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారు. విషయాలన్నీ నన్ను ఆనాటì సీఎం కిరణ్కుమార్రెడ్డి గారికి మొర పెట్టుకొనేలా చేశాయి.
కానీ, ఉమ్మడి రాష్ట్రంలో నాకు వారి అప్పాయింట్మెంట్ కూడా దొరకలేదు. బయట ఉద్యమ నాయకులను సంప్రదిస్తే వాళ్లు నాకు సహాయం చేయక పోగా, ఎగతాళి చేశారు. తెలంగాణచిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారికి, సోనియా గాంధీజీకి లేఖలు రాసి నా పరిస్థితిని, రాష్ట్ర దుస్థితినీ వివరించా. ప్రత్యక్ష ఉద్యమంలో నేను మళ్లీ పాల్గొనడం అనివార్యం అనిపించింది.తెలంగాణ కోసం ఒకవైపు, వేధింపులు తట్టుకోలేక ఒకవైపు ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకున్నా. ప్రజల్లోకి వెళ్లా.. శ్రీకృష్ణ కమిటీ ప్రభావంతో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించా. ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది. దేశద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు అందులో ఉన్నాయి. అన్ని పత్రికల్లో నా ఫోటోలు వేసి ఈ వార్తను పెద్దగా రాసి హైలైట్ చేశారు. ఆనాడే నాకు డిపార్ట్మెంట్పై ఏహ్య భావం కలిగింది. సుష్మా స్వరాజ్గారు నల్గొండ సభకు ఆ రోజే రావడం, నన్ను అర్థం చేసుకొని అక్కున చేర్చుకోవడం నాకు కాస్త స్వాంతన చేకూర్చింది. నాలోని ఒక డైనమిక్ కమిటెడ్ ఆఫీసరు ఆ రోజే హత్య చేశారు.12 ఏళ్ల తర్వాత తెలంగాణా మూలాలు కలిగిన ఒక సీఎంగా మీరు వచ్చారు. నా గురించి ఆరా తీశారు. ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు.
చాలా సంతోషంగా ఉంది. మీ వినతికి కృతజ్ఞతలు. ఇన్నాళ్లకు నా పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకొనే ఒక సందర్భం సృష్టించారు. మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. మీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో బతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్లలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థం అయ్యింది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నది నిరూపణ అయ్యింది.ఉద్యమంలో నేను నిర్వహించిన కీలకమైన పాత్ర నన్ను ప్రజలకు దగ్గర చేసింది. కాని నా బంధు మిత్ర పరివారం మాత్రం అందరూ నన్ను వెలివేశారు. మానసిక శిక్ష పదేళ్లు అనుభవించా. పర్యవసానంగా ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయాను. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను. జీవచ్చవంలా బతికాను. రెండేండ్ల క్రితం దేవుడి దయ వల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడు. వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు.
అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను. జీవితంలో పది జన్మలకు సరిపడా కష్టాలు పడ్డాను. చాలు. ఇంకా నేను ఎవరి కోసం ఇంకెటువంటి త్యాగమూ చేయలేను . జన్మ రాహిత్యం కోసం అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్నాను. వేద ప్రచారకురాలిగా, వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా ముందున్న కర్తవ్యం. దీని వల్ల నా ఆత్మ ఉన్నతితో పాటు, సమాజ ఉన్నతికి కూడా పాటుపడొచ్చు. కాబట్టి నా పంథా మార్చుకోలేను. మీరు భావిస్తున్నట్లు పోలీస్ కాకుండా వేరే ఉద్యోగం కూడా నేను చేయలేను. ఎందుకంటే నా అమూల్య సమయాన్ని బ్యురోక్రసికి వెచ్చించలేను. శ్రేయోమార్గం విడిచి మళ్లీ ప్రేయోమార్గం వైపు రాలేను. అన్ని దానాల్లో గొప్పదైన విద్యా దానాన్ని చేస్తూ, పుణ్యం మూటకట్టుకోవాలనే కోరిక తప్ప నాకు ఇంకేమీ లేదు.పరమేశ్వరుడు నన్ను క్రిమినాలజీ (న్యాయ దర్శనం) నుండి ఫిలాసఫీ (తత్త్వశాస్త్రం) వైపు నడిపించాడు. గన్ స్థానంలో నా చేత వేదం పట్టించాడు. నా వాణిలో మాధుర్యం నింపి నన్ను ఆచార్యను చేశాడు. నా ఈ ప్రస్థానం (డీఎస్పీ నుండి డీఎన్ఏగా మారడం) చాలా సంఘర్షణ మయం, వేదనా భరితం.
నన్ను ఈ ఉద్యోగం నుంచి ఎవరూ సస్పెండ్ చేయలేరు. నేను దీనికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎన్నడూ కలగవు. కాబట్టి అంతిమంగా నేను సీఎంగా మిమ్మల్ని కోరేది ఏమిటంటే నాపైకరుణ చూపి స్టేటస్కో అనుమతించండి. నాలా ఇంకే ఆఫీసర్ డిపార్ట్మెంట్లోఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోండి. మీలో మంచి స్పార్క్ ఉంది. మీ నుంచి చక్కని పాలన ఆశించవచ్చు అనిపిస్తుంది. మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే అని నా జీవితంలో రుజువైంది.ఇక, నాకు మీరు న్యాయం చేయాలి అంటే నాకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తాను. ఎందుకంటే మీరు రాజు, నేను బ్రాహ్మణిని. మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్ను నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద, యజ్ఞ, సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను.ఇలా డీఎస్పీ నళిని సీఎం ఉద్యోగ ఆఫర్ను సున్నితంగా తిరస్కరిచండమే కాదు.. ఆమె రాసిన లేఖ పోలీసు డిపార్ట్మంట్లో ఎంతో మందిని ఆలోచింపచేస్తుంది. కర్కశ మృదయాలనూ కదిలిస్తుంది.