మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణకు వెళ్తూ.. వెళ్తూ ధ్వంసం చేశారని ఆరోపణలు వచ్చిన 10 పాత ఫోన్లను కవిత మీడియాకు చూపించారు. కారులో ఉన్న ఫోన్లను బయటికి తీసి ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేసిన ఫోన్లను స్వయంగా ఆమే చూపించారు. ఈడీ కార్యాలయానికి ఆ ఫోన్లను కవిత తీసుకెళ్లారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసం దగ్గర ఒకసారి.. ఈడీ ఆఫీసు ముందు మరోసారి కవిత తన ఫోన్లను చూపించారు. సోమవారం జరిగిన విచారణలో మొబైల్స్ తీసుకురావాలని ఈడీ అధికారులు ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఇవాళ తన వెంట కవిత ఆ ఫోన్లు తీసుకెళ్లారని తెలియవచ్చింది. ఈ ఫోన్లన్నీ ఈడీ ఆఫీసర్లకు కవిత ఇవ్వనున్నారు. కాగా సెప్టెంబర్ 2021 నుంచి ఆగస్టు 2022 వరకు కవిత 10 ఫోన్లు వాడినట్లు, ధ్వంసం కూడా చేసినట్లు ఈడీ అభియోగం ఉంది.
ఈ కేసులో మొత్తం 36 మంది 170 ఫోన్లు మార్చారని ఈడీ అభియోగాలు ఉన్నాయి. స్పెషల్ కోర్టుకు దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్లో కవిత 10 ఫోన్లు వాడినట్లు ఈడీ స్పష్టంగా తెలిపింది. మొత్తానికి చూస్తే.. ఫోన్లు ధ్వంసం చేశారన్న ఈడీ అభియోగంపై ఇవాళ్టితో కవిత ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. కాగా మొదటిరోజు విచారణ రోజే కవిత వ్యక్తిగత ఫోన్ను ఈడీ సీజ్ చేసింది.కాగా.. ఇప్పటి వరకూ రెండుసార్లు విచారణకు హాజరైన కవిత తన వెంట లాయర్లను తీసుకెళ్లలేదు. అయితే ఇవాళ మాత్రం లాయర్లతో కలిసే ఈడీ ఆఫీసుకు వెళ్లారు. దీంతో విచారణ తర్వాత ఏం జరుగుతుందో ఏమో అని బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ పెరిగిపోయింది. అంతకుముందే న్యాయనిపుణులతో కవిత కీలక సమావేశం నిర్వహించారు.
ఇవాళ్టి విచారణలో ఎలా ముందుకెళ్లాలి..? అనేదానిపై న్యాయవాదులతో ఆమె సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు అరగంటకుపైగా లాయర్లతో కవిత, మంత్రి కేటీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. న్యాయవాదులతో సమావేశం అనంతరం కవిత తిరిగి కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత కవిత ఈడీ ఆఫీసుకు బయల్దేరివెళ్లారు. వాస్తవానికి ఈడీ విచారణకు ముందు కవిత ప్రెస్మీట్ పెట్టే అవకాశాలున్నాయని మొదట వార్తలు వచ్చాయి. మీడియా ప్రతినిధులు కూడా కేసీఆర్ నివాసం దగ్గర సిద్ధంగా ఉన్నారు. అయితే చివరి నిమిషంలో ప్రెస్మీట్ రద్దయ్యింది.