బ్లాక్ బస్టర్ గా టీడీపీ, జనసేన ఫస్ట్ యాడ్..
కాకినాడ, జనవరి 17
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఫిబ్రవరిలో లోక్సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో అధికార వైసీపీ సర్కార్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నాయి. ప్రధాని మోదీ ఏపీలో నిర్మించిన అకాడమీ ఆఫ్ నేషనల్ కస్టమ్స్, ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ను జనవరి 16న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. జనవరి 19 ఏపీలో నిర్మించిన భారీ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక ఏపీ సర్కార్.. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే వివిధ సంక్షేమ పథకాలపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు ఇస్తోంది. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న జగన్.. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.ఇక వైసీపీ ముక్త ఏపీ లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈమేరకు సీట్ల పంపకాలపైనా చర్చలు జరుపుతున్నారు ఇరు పార్టీల అధినేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు.
జనసేన 40 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. ఈమేరకు ఇటీవల చంద్రబాబు – పవన్ కళ్యాణ్ భేటీ అయి చర్చించారు కూడా. అంతకు ముందు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు సమావేశమయ్యారు. ఎన్నికలకు అధికార వైసీపీ ఇచ్చే హామీలకు ధీటుగా టీడీపీ + జనసేన రెడీ అవుతున్నాయి. ప్రధానంగా టీడీపీ ఆరు గ్యారంటీ లు, జనసేన ఆరు హామీలపై చర్చించారు. 12 అంశాలను ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చే అవకాశం ఉంది.ఇక వచ్చే ఎన్నికల కోసం దాదాపు నెల రోజులుగా వైసీపీ క్యాపెయిన్ చేస్తోంది. సీఎం జగన్ సభలు నిర్వహిస్తుండగా, ఎమ్మెల్యేలు, మంత్రులు పాదయాత్రలు, బస్సు యాత్రలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక ప్రచారంలో మరో కీలక అంశం మీడియా ప్రభావం. దీంతో వైసీపీ ఐదేళ్లలో అమలు చేసిన పథకాలపై టీవీలు, పేపర్లకు ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించింది. దీంతో టీడీపీ + జనసేన కూడా క్యాంపెయిన్ కు సిద్ధమయ్యాయి. ఈమేరకు సభలు, కదలి రండి పేరుతో యాత్రలు నిర్వహిస్తున్నాయి. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాతోపాటు, సోషల్ మీడియాను కూడా క్యాంపెయిన్కు వీలైనంత ఎక్కువగా వాడుకోవాలని భావిస్తున్నారు.వైసీసీ పథకాలపై ఇస్తున్న ప్రకటనలకు దీటుగా టీడీపీ + జనసేన ఒక ప్రకటన రూపొందించింది.
తొలి ప్రకటనే బ్లాక్బస్టర్ లెవల్లో ఉందన్న చర్చ జరుగుతోంది. నిమిషం 30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ప్రభుత్వ మూడు వైఫల్యాలను ప్రధానంగా చూపించారు. దుబాయ్ నుంచి ఏపీకి వచ్చిన ఓ మహిళ.. ఆటోలో సొంత గ్రామానికి వస్తున్నట్లు వీడియో తీశారు. ఆటోలో వస్తున్న ఆమె రోడ్ల దుస్థితిని తెలిపేలా నడుము విరిగిందిరా బాబు అంటూ చెప్పడం ద్వారా రోడ్ల పరిస్థితిని తెలిపింది. ఇక బంధువు ఇంట్లోకి వెళ్తూ.. బంధువు భర్త మంచాన పడి ఉండడాన్ని చూసి ఏమైందని అడగ్గా.. మద్యం తాగి ఇలా అయ్యాడని బంధువు చెబుతుంది. మధ్య నిషేధం అన్నారు కదా అని అడగ్గా పొరుగు రాష్ట్రం నుంచి వచ్చే మందును ఆపడం.. నాటు సారాకు స్టిక్కర్లు వేసుకుని అమ్మడమే నిషేధం అంటే అని చెప్పడం ద్వారా మద్య నిషేధం లేదని చెప్పడంతోపాటు కల్తీ మద్యం అమ్ముతున్నారన్న విషయాలను ఈ ప్రకటనలో చూపించారు. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అన్నట్లుగా.. ఒక్క ప్రకటనతో.. వైసీపీ సర్కార్ మూడు వైఫల్యాలను టీడీపీ + జనసేన పార్టీ సంయుక్త ప్రకటనలో చూపించారు.