కాంగ్రెస్ తో టచ్ లోకి వైసీపీ అసంతృప్తులు
గుంటూరు, జనవరి 17,
ఏపీ పై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో బలం పెంచుకోవాలని చూస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. ఒకప్పుడు 30 శాతం కంటే అధిక ఓట్లతో బలంగా ఉంటే ఆ పార్టీ.. కిందకి పడిపోయింది. ఏకసంఖ్య కూడా దాటడం లేదు. దీంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది. అయితే పక్కన ఉన్న కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో మంచి విజయం నమోదు చేసుకుంది. దీంతో ఏపీపై పట్టు బిగించాలని చూస్తోంది. వైఎస్ షర్మిల ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. ఏపీ పగ్గాలు అందించేందుకు కసరత్తు చేస్తోంది. సరిగ్గా ఇప్పుడే ఏపీ రాజకీయాలను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చాలని షర్మిల భావిస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని చూస్తున్నారు.ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులను మార్చి జగన్ సంచలనాలకు కారణమవుతున్నారు. ఇప్పటివరకు మూడు జాబితాలను ప్రకటించారు. 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించారు.
వీరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి లాంటి కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. కొలుసు పార్థసారథి సైతం పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరనున్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని వంశీ జనసేనలో చేరుతానని ప్రకటించారు.అటు టిడిపి, జనసేన కూటమి ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. కూటమిలోకి బిజెపి వస్తుందని అంతా భావిస్తున్నారు. ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేనతో పాటు బిజెపికి కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుంది. అయితే అవే సీట్లు అన్నది తెలియడం లేదు. సంక్రాంతి సందర్భంగా 25 మందితో జాబితాను ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోను సైతంవిడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు. కూటమి అభ్యర్థుల ప్రకటన వచ్చిన తర్వాత చాలా రకాల మార్పులు జరిగే అవకాశం ఉంది. కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీలోని అసంతృప్త నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి టచ్ లోకి వెళ్లారు. వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం.
2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా.. ఉనికి చాటుకునే అవకాశాలు ఉన్నాయి. 2029 లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏపీలో క్రియాశీలకంగా మారే ఛాన్స్ కనిపిస్తోంది. అందుకే భవిష్యత్తును వెతుక్కుంటున్న చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తున్నారు.ఎన్నికల్లో ప్రధాన పార్టీల గెలుపోటములు కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపనున్నాయి. ఒకవేళ వైసీపీ ఓడిపోతే మాత్రం ఆ పార్టీలోనే సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరే అవకాశం ఉంది. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకున్నా.. వీలైనంతవరకు ఎక్కువ స్థానాలు దక్కించుకున్నా.. అదే సమయంలో ఏపీలో వైసిపి ఓటమి చవిచూసినా కాంగ్రెస్ పార్టీ దశ మారినట్టే. వైసీపీ నుంచి నేతలు క్యూ కడతారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను కాంగ్రెస్ దక్కించుకునే అవకాశం ఉంటుంది. 2029 ఎన్నికల్లో విజయానికి చేరువయ్యేందుకు మార్గాన్ని సుగమం చేసుకునే ఛాన్స్ ఉంది.