Sunny Yadav : ప్రముఖ తెలుగు వ్లాగర్, బైక్ రైడర్, యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు చెన్నైలో అరెస్టు చేశారు. సన్నీ యాదవ్ అరెస్టు.. ఒక్కసారిగా అతని స్వగ్రామం నూతనకల్లో కలకలం రేపింది. సన్నీ యాదవ్ అరెస్టుపై ఎన్ఐఏ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ట్రావెల్ జ్యో, బయ్యాకు సంబంధాలు..
ఆరా తీస్తున్న అధికారులు
హైదరాబాద్, మే 31
ప్రముఖ తెలుగు వ్లాగర్, బైక్ రైడర్, యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు చెన్నైలో అరెస్టు చేశారు. సన్నీ యాదవ్ అరెస్టు.. ఒక్కసారిగా అతని స్వగ్రామం నూతనకల్లో కలకలం రేపింది. సన్నీ యాదవ్ అరెస్టుపై ఎన్ఐఏ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో బైక్ రైడర్ సన్నీ యాదవ్ ఆచూకీ పై తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన భయ్యా రవీందర్, అనూష దంపతుల కుమారుడు సన్నీ యాదవ్. చిన్నతనం నుంచే బైక్ లను నడపడం సరదా. ఈ సరదాతోనే వ్లాగింగ్ మీద ఆసక్తి పెంచుకున్నాడు. 2016 నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు బైక్ పై రైడింగ్ చేసి వీడియోలను పోస్ట్ చేసేవాడు. 2019లో 21 రోజుల్లోనే బైక్ పై లద్దాఖ్కు యాత్ర చేశాడు. ఆ యాత్రతో సబ్స్ర్కైబర్ల సంఖ్య ఒక్క సారిగా మూడు లక్షలకు చేరుకుంది. దాంతో.. పూర్తిస్థాయి వ్లాగర్గా మారిపోయి 2019లో నేపాల్కు వెళ్లి.. తొలి విదేశీ యాత్రను పూర్తి చేశారు.
ఇలా అనతికాలంలోనే బాగా ఫేమస్ అయ్యాడు.. అయితే.. ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన కారణంగా బయ్యా సన్నీ యాదవ్పై మార్చి 5వ నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. అదే సమయంలో కొందరు యూట్యూబర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే సన్నీ యాదవ్ విదేశాల్లో ఉండడంతో పోలీసులు పోలీసులు లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. దీంతో సన్నీ యాదవ్ దుబాయ్ నుంచి పాకిస్తాన్ కు వెళ్లాడు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సన్నీ యాదవ్ తల్లిదండ్రులు హైకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్నారు.పహల్గామ్ ఉగ్ర దాడి జరిగిన సమయంలో బైక్ రైడర్, యూట్యూబార్ సన్నీ యాదవ్ పాక్ లోనే ఉన్నాడు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టిన నేపథ్యంలో భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్తతలు నెలకున్నాయి. దేశంలోని కొందరు యూట్యూబర్లు స్పై గా పనిచేస్తూ భారత రహస్యాలన్నింటినీ పాక్ కు చేరవేస్తున్నారని ఎన్ఐఏ అధికారులు అనుమానించారు. దీంతో దేశంలోని కొందరు యూట్యూబర్లపై ఫోకస్ పెట్టారు.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, మరో 11 మందినీ ఎన్ఐఏ అరెస్టు చేసింది. మరికొందరు యూట్యూబర్లపై నిఘా పెంచింది. పాకిస్తాన్ నుండి సన్నీ యాదవ్ రెండు వారాల క్రితం ఇండియా వచ్చాడు. పాక్ లో పర్యటించిన వీడియోలను తన యూట్యూబ్ ఖాతాలో పోస్టు చేశాడు. సన్నీ యాదవ్ తన పాకిస్థాన్ ట్రిప్పైనా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు..ఇదేంది భయ్యా ఇది. ఇదెక్కడ చూడలే. ఓవైపు మనదేశం పాకిస్తాన్.. దాని తీవ్రవాదంతో పోరాడుతుంటే.. నువ్వేమో బైక్ వేసుకుని పాక్కు వెళ్లి నీ జీవితాశయం నెవేరిందని తెగ హైప్ ఇస్తున్నావు! ఓవైపు భారత స్త్రీలు తమ సింధూరాలు కోల్పోయి.. క్షోభను అనుభవిస్తుంటే.. నువ్వు పనీర్ రోటీలు తింటూ ఎంజాయ్ చేస్తున్నావు. పాక్ ఉగ్రవాదంతో మనం పోరాడుతుంటే.. వారి దేశంలో సైట్ సీయింగ్ ముఖ్యమైపోయిందా సన్నీ. ఇది ఒకరి ఆవేదన కాదు.. యూట్యూబ్లో బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్ వీడియోల కింద వస్తున్న వందలాది కామెంట్లు. ఇటీవల అతడు తన మోటార్బైక్ మీద పాకిస్తాన్ వెళ్లడం పెద్ద ఇష్యూ అయిందిపాక్ వెళ్లి వచ్చిన బైక్ రైడర్ సన్నీ యాదవ్ పై నిఘా ఉంచిన ఎన్ఐఏ అధికారులు ఈనెల 29వ తేదీన చెన్నైలో అరెస్టు చేశారు.
పాక్ సందర్శనకు గల కారణాలపై విచారణ జరిపేందుకు ఎన్ఐఏ అధికారులు అతడిని చేసినట్లు తెలిసింది. సన్నీ యాదవ్ అసలు పాకిస్థాన్కు ఎందుకు వెళ్లాడు? ఉద్రిక్తతల తరుణంలో శత్రుదేశాన్ని సందర్శించడానికి కారణమేంటి? పాక్ లో ఏయే ప్రాంతాల్లో సన్నీ యాదవ్ సందర్శించాడు..? ఎవరిని కలిశాడు..? ఎందుకు కలిశాడు అనే కోణంలో అతడిని విచారిస్తున్నట్లు సమాచారం.. ఇప్పటికే అరెస్టైన పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కేసులో సన్నీ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.. ఆమెతో సన్నీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా సంస్థలు సన్నీ మొబైల్, కమ్యూనికేషన్ చరిత్రను విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది..యూట్యూబ్, బైక్ రైడర్ సన్నీ యాదవ్ అరెస్టుపై అతడి తల్లిదండ్రులు, స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈనెల 29వ తేదీన చెన్నైలోని తన ఇంటి నుండి ఐదుగురు వ్యక్తులు మఫ్టీలో సన్నీ యాదవ్ ను తీసుకెళ్లారని అతని స్నేహితుడు చెర్రీ చెబుతున్నాడు. సన్నీ యాదవ్ ను దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని చెర్రీ చెబుతున్నాడు. ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేస్తే.. తమకు సమాచారం ఇవ్వాలని అతని తల్లిదండ్రులు కోరుతున్నారు. తమ కొడుకు దేశభక్తి కలిగినవాడని, ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని తండ్రి రవీందర్ వాపోతున్నాడు. కేవలం బైక్ రైడర్ గా మాత్రమే పాక్ ను సందర్శించాడని చెబుతున్నాడు. తన కుమారుడిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారా..? లేక మరెవరైనా ఎత్తుకెళ్లారనే ఆందోళనను వ్యక్తం చేశారు. తన కొడుకు ఆచూకీ చెప్పకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని రవీందర్ చెబుతున్నాడు. హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ వేస్తామని చెప్పారు.
