-
వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి (70) కన్నుమూత
-
పొలంలో పనులు చూస్తుండగా గుండెపోటు
-
ఆసుపత్రికి తరలించినా దక్కని ఫలితం
వైసీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ తోపుదుర్తి భాస్కర్ రెడ్డి (70) గుండెపోటుతో కన్నుమూశారు. అనంతపురం జిల్లా రాజకీయాల్లో విషాదం నెలకొల్పిన ఈ ఘటన, ఆయన స్వగ్రామం ఆత్మకూరు మండలం తోపుదుర్తిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే, భాస్కర్ రెడ్డి తన పొలంలో కూలీలతో పనులు చేయిస్తుండగా ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
తోపుదుర్తి భాస్కర్ రెడ్డి సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగానూ సేవలందించారు. ఆయన భార్య తోపుదుర్తి కవిత, ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వర్తించారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఈ దంపతులు ఆ పార్టీలో చేరారు.
ఆయన మృతదేహాన్ని అనంతపురంలోని రామచంద్రనగర్లోని స్వగృహానికి తరలించారు. విషయం తెలిసిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మాజీ ఎంపీ రంగయ్య, గంగుల భానుమతి, మధుసూదన్రెడ్డి వంటి నేతలు భాస్కర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. భాస్కర్ రెడ్డికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మరణంతో జిల్లా వైసీపీ శ్రేణుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read also : DelhiFlu : ఢిల్లీలో కలకలం రేపుతున్న H3N2 ఫ్లూ: లక్షణాలు, జాగ్రత్తలు, చికిత్స వివరాలు
