- వ్యూహాత్మక అడుగులతో ముందుకు
- నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు
- రాబోయే ఎన్నికలకు కసరత్తు షురూ
ఏ విషయంలోనైనా విజయం సాధించడం అంటే ఒక పరీక్షే.. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒక్కోసారి ఓటమి తగిన గుణపాఠాన్ని నేర్పుతుంది.. రాజకీయాల్లో కూడా ఇలాంటివి అనేకం జరుగుతుంటాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కో సమయంలో గెలుపోటములు భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతాయో అర్ధం కాని పరిస్థితులు ఏర్పడతాయి.. ఎన్నికలంటేనే ఉత్కంఠ వాతావరణం నెలకొంటుంది.. సమ ఉజ్జీవులుగా అభ్యర్థులుంటే ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడుతారోననే ఆసక్తి రసవత్తరంగా ఉంటుంది.. విపత్కర పరిస్థితుల్లో కుటుంబసభ్యులు తోడుగా నిలబడి విజయాన్ని చేజిక్కుంచుకునేలా కృషి చేస్తే అంతకన్నా అదృష్టం మరోటి ఉండదు.. కొద్దినెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు..
‘పతి’ గెలుపు కోసం ‘సతీమణి’ కృషి..
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గండ్ర దంపతులు ప్రజలతో సత్సంబంధాలను మెరుగు పర్చుకుంటున్నారు. గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన గండ్ర వెంకటరమణారెడ్డి అనూహ్యరీతిలో గెలుపొందాడు. గెలుపు వెనుక ‘ఆమె’ చేసిన కృషి ఎంతో ఉంది. ప్రస్తుతం గండ్ర వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారంటే, దానికి కారణం ఆయన సతీమణి గండ్ర జ్యోతి కృషి ఉందని ఈ ప్రాంత ప్రజల్లో ఉంది. అప్పట్లో టీఆర్ఎస్ గాలి బలంగా ఉండగా అప్పటి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి విజయం సాధిస్తారని, రెండోస్థానంలో మరో బలమైన అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు రెండోస్థానంలో, కాంగ్రెస్ పార్టీకి చెందిన గండ్ర వెంకటరమణారెడ్డి మూడోస్థానంలో ఉండే అవకాశాలున్నట్లు వివిధ సర్వేలు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో గండ్ర వెంకటరమణారెడ్డి కంటే ఆయన సతీమణీ జ్యోతి ఎక్కువ చొరవ తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పారు.
ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని గ్రామగ్రామాన ఇంటింటికి కాలి నడకన తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ, గండ్ర వెంకటరమణారెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఓ వైపు వెంకటరమణారెడ్డి, మరోవైపు జ్యోతి లిద్దరూ విరామం లేకుండా తిరుగుతూ నాయకులను, కార్యకర్తలను అప్రమత్తం చేస్తూ, చాపకిందనీరులా తమ వ్యూహాలతో కష్టపడి ముందుకు సాగారు. తదననంతరం జరిగిన ఎన్నికల ఫలితాల్లో గండ్ర వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి నుండి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటూ తనదైన శైలిలో పార్టీలో కలియదిరుగుతున్న పరిస్థితులలో కొద్ది నెలల్లోనే దంపతులిద్దరూ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తరువాత అందివచ్చిన అవకాశంతో గండ్ర జ్యోతి వరంగల్ జడ్పీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు.
ఎన్నికల వ్యూహాలకు పదును..
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో గండ్ర దంపతులు వ్యూహాలకు పదును పెడుతూ పావులు కదుపుతున్నారు. అధిష్టానంతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ టికెట్ డిక్లేర్ కోసం ఎదురుచూస్తూనే మరోవైపు నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలను మెరుగు పర్చుకుంటున్నారు. గత ఎన్నికల్లో చేపట్టిన వ్యూహాలకనుగుణంగా మరింత పదును పెడుతున్నట్లుగా ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యేగా గండ్ర వెంకటరమణారెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల అమలుపై దృష్టిసారించడమే గాకుండా ‘మన ఊరు మన రమణన్న’ పేరుతో పల్లెనిద్రలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఆయన సతీమణీ జ్యోతి జిల్లాలోని పార్టీ శ్రేణుల మంచి చెడులు చూసుకుంటూ నియోజకవర్గంలో ఉన్న స్థితిగతులను అంచనా వేస్తున్నారు. మరోవైపు గండ్ర దంపతుల కుమారుడు గౌతంరెడ్డి జీఎంఆర్ఎం ట్రస్టు పేరుతో నియోజకవర్గంలో ఆనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ తల్లిదండ్రులకు పేరుప్రఖ్యాతులు తీసుకువస్తున్నాడు. ఇప్పటికే గండ్ర వెంకటరమణారెడ్డికే అసెంబ్లీ టికెట్ అని కేటీఆర్ అప్పట్లో ఇక్కడ జరిగిన మీటింగ్ లో చెప్పగా గండ్ర వెంకటరమణారెడ్డి కుటుంబం నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించి విజయాన్ని తమవైపు తిప్పుకునేలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నారు.