సమగ్ర వివరాలు సమర్పించండి
ఎవరికి, ఎంత సాయం చేశారో చెప్పండి
ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
రెండో నివేదికా అస్పష్టంగా ఉందని వ్యాఖ్య
వానలు, వరదల మీద ధర్మాసనం విచారణ
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వరదలకు సంబంధించి రూ. 500 కోట్లు ఎవరికి పంచారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎంతమందికి పంచారు? ఎవరెవరికీ పంచారు? ఎక్కడెక్కడ పంచారో వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. పంచిన విధానమేమిటి? ఏ గ్రామంలో ఎంత మందికి పంచారో వివరాలు ఇవ్వాలని సూచించింది. వర్షాలు, వరదలపై రెండోసారి ప్రభుత్వం సమర్పించిన నివేదికపై కూడా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నివేదిక అస్పష్టంగా ఉందని పేర్కొన్నది. సమగ్ర నివేదికను ఇవ్వాలని కోరింది. ఈ అంశం మీద హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. వరదల ప్రభావంతో 49 మంది మృతి చెందారని ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. రూ.500 కోట్లు పునరావాసం కోసం కేటాయించామని వెల్లడించింది. అయితే., ప్రభుత్వం రెండోసారి దాఖలు చేసిన నివేదిక కూడా అసంపూర్తిగా ఉందని పిటిషనర్ తరుపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషనర్ తరపున మరో నివేదికను కోర్టుకు సమర్పించారు. బాధితులకు తగిన న్యాయం జరగలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలోనే రూ.500 కోట్లు ఎవరికి ఇచ్చారో నివేదికలో లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అంటువ్యాధులతో బాధపడుతున్న వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆదేశించింది. చనిపోయిన 49 మందికి ఎంత నష్ట పరిహారం చెల్లించారో సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించింది. తెలిపింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.