Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే

0

విజయవాడ, జనవరి 31: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార పార్టీ వైఎస్‌ఆర్‌సీపీలో విభేదాలు క్రమంగా బయటపడుతున్నాయి. వరుస ఘటనలతో కృష్ణాజిల్లాలోని నేతలు రోడ్డెక్కుతున్నారు. దీంతో కృష్ణాజిల్లా వైసీపీలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహికి దిగుతున్నాయి. కృష్ణాజిల్లా బందరు పార్లమెంట్ సభ్యడు బాలశౌరికి, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహద్రి రమేష్‌కు మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ, ఎమ్మెల్యేల వర్గాలు బాహాబాహీకి దిగటం సంచలనంగా మారింది. ఈ ఘటనలో పలువురుకి గాయాలు కూడా అయ్యాయి. అయితే ఈ ఘర్షణను చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా సింహాద్రి వర్గానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మీడియా వ్యక్తులకు చెందని ఫోన్‌లను కూడా లాక్కొని ధ్వంసం చేశారు.

దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యవహరం పై ఎంపీ వర్గం కూడా తీవ్ర ఆగ్రహంతో ఉంది.పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంపీ వర్గం..జరిగిన ఘర్షణపై మచిలీపట్నం జిల్లా పోలీస్ కార్యాలయానికి వెళ్లిన ఎంపీ వర్గం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. గరికిపాటి శివ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, కుమారుడు వికాస్ మేనల్లుడిపై కూడా గరికపాటి శివ ఫిర్యాదు చేశారు. సింహాద్రి రమేష్ కుటుంబంతో తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో గరికపాటి శివ స్పష్టం చేశారు. పక్కా పథకం ప్రకారమే తమపై దాడి చేశారని వైసీపీ నాయకులంతా చూస్తుండగానే దాడి జరిగిందని పోలీసులకు వివరించారు.గత మూడు నెలలుగా ఫోన్లో బెదిరింపులకు పాల్పడుతున్నారని, తన పై జరిగిన దాడిలో పోలీసుల హస్తం కూడా ఉందని గరికిపాటి శివ ఆరోపించారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నామని, జగన్‌కు అభిమానంతో పార్టీ కోసం పని చేస్తుంటే, దాడికి దిగటం దారుణమని శివ తన ఆవేదన వెలిబుచ్చారు.

ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు కామన్ అయిపోయాయి. బందరు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యే పేర్నినాని తో ఎంపీ బాలశౌరికి మధ్య విభేదాలు బహిర్గం అయ్యాయి. పేర్ని నాని, బాలశౌరి వర్గాలు రెండుగా విడిపోయి, బాహాబాహీకి దిగటం పరిపాటిగా మారింది. మంత్రిగా పని చేసిన, ఎమ్మెల్యే పేర్నినాని స్థానికంగా నిర్వహించే కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం పార్లమెంట్ సభ్యులను ఆహ్వనించాల్సి ఉంటుంది. అయితే ప్రోటోకాల్ పాటించకపోవటం పై ఎంపీ వర్గం అనేక సార్లు తమ అభ్యంతరం తెలిపింది. అయినా అధికారులపై ఒత్తిడి కారణంగా ఎంపీ బాలశౌరిని కార్యక్రమాలకు ఆహ్వనించలేదు.

దీంతో వీరిద్దరి మధ్య వైరం పతాక స్దాయికి చేరింది. ఈ వ్యవహరంపై సీఎం జగన్ వద్ద కూడా పంచాయితీ జరిగింది. పార్లమెంట్ పరిధిలో జరిగే కార్యక్రమాలకు తనను ఆహ్వనించకపోగా, కనీసం సమాచారం కూడా ఇవ్వటం లేదని, ఏదైనా ఉంటే ఢిల్లీలో చూసుకోండి, ఇక్కడ మీకేం పనంటూ ఎమ్మెల్యే పేర్నినాని చేసిన వ్యాఖ్యల పై ఎంపీ బాలశౌరి తీవ్ర అభ్యంతరం తెలిపారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అదే సమయంలో ఎంపీగా బాలశౌరి టీడీపీకి చెందిన వ్యక్తులను ప్రోత్సహిస్తున్నారని, ఎమ్మెల్యే పేర్ని నాని ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహరంపై పార్టీ పెద్దలు కూడా విచారణ చేపట్టి నివేదికను జగన్ కు అందించారనే ప్రచారం జరుగుతుంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie