వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లపాలనపై టీడీపీ ఛార్జ్ షీట్ వేసిందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 4 ఏళ్ల జగన్ పాలన చూస్తే ఏమున్నది గర్వకారణం అనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో ఎటు చూసినా నేరాలు-ఘోరాలు, లూఠీలు, విధ్వంసాలు, విద్వేషాలు, అబద్ధాలే కనిపిస్తున్నాయన్నారు. సీబీఐ భయంతో తన నివాసంలో ముఖ్యమంత్రి బిక్కుబిక్కుమంటూ అభద్రతాభావంలో ఉన్నారని అన్నారు.
జగన్ తాను ముఖ్యమంత్రి కావడానికి ఒక ప్రణాళిక వేసుకుని 2019 మార్చి15న చేసిన ఒక కార్యక్రమమే, నాలుగేళ్ల తర్వాత ఆయన బిక్కుబిక్కుమంటూ ఇంట్లో కూర్చునే విషాదకరమైన పరిస్థితికి కారణమైందని వర్ల రామయ్య అన్నారు. వివేకానంద రెడ్డి హత్య విషయం జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసునని సీబీఐ హై కోర్టు లో అఫిడవిట్ వేశాక కూడా ముఖ్యమంత్రి పదవిలో ఆయన కొనసాగడం నిజంగా సిగ్గుచేటన్నారు. హత్యకేసులో సీబీఐ జగన్ పేరు ప్రస్తావించాక కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత ఉందా? అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నామని వర్ల రామయ్య అన్నారు.