తిరుపతి,
భగవంతుని తత్వాన్ని తెలుసుకునేందుకు శరణాగతి తప్ప మరో మార్గం లేదని భక్తులకు అన్నమయ్య తెలియజేశారని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్థంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం సాహితీ సదస్సులు ప్రారంభమయ్యాయి. సదస్సుకు అధ్యక్షత వహించిన డాక్టర్ రవి కుమార్ ”అన్నమయ్య – యోగ సంకీర్తనలు” అనే అంశంపై ఉపన్యసిస్తూ, ప్రసిద్ధ శ్రీవైష్ణవాచార్యులు భగవద్ రామానుజులు తెలియజేసిన అష్టాక్షరి మంత్రాన్ని అన్నమయ్య తన సంకీర్తనల ద్వారా శ్రీ వైష్ణవ ధర్మాన్ని, భక్తి తత్వాన్ని ప్రచారం చేసినట్టు తెలిపారు. అన్నమయ్య యోగ సంకీర్తనల ద్వారా ధర్మ, భక్తి, శరణాగతి, అహింస ప్రధానంగా ఉన్నాయన్నారు. హింసకు దూరంగా ఉండి భగవంతునిపై పూర్తి విశ్వాసంతో నామసంకీర్తనం చేస్తే ముక్తి కలుగుతుందని అన్నమయ్య కీర్తనల ద్వారా అవగతమవుతుందని వివరించారు.
కులగణనపై ఒక స్పష్టమైన కార్యాచరణ
నరసాపురంకు చెందిన ప్రముఖ సాహితీవేత్త డా.రామారావు ‘అన్నమయ్య – భావుకత’ అనే అంశంపై ఉపన్యసిస్తూ, సామాన్య ప్రజలను చైతన్యవంతం చేసేందుకు అన్నమయ్య కీర్తనలను రచించినట్టు తెలిపారు. వాడుక భాషలోని సామెతలు, పలుకుబడులను ఉపయోగించి పామరులకు సైతం అర్థమయ్యేలా రచనలు చేశారని కొనియాడారు. హరిభక్తి, సద్భావన, సామాజిక సంఘ సంస్కర్తగా అన్నమయ్య నిలిచారని వివరించారు.అనంతరం తిరుపతికి చెందిన తెలుగు అధ్యాపకులు శ్రీ రాములు ‘వాగ్గేయకారులు – అన్నమయ్య ప్రత్యేకత’ అనే అంశంపై ఉపన్యసిస్తూ, శరణాగతి, లోకనీతి, వేదాల్లోని సారాన్ని కలిపి అన్నమయ్య తన సాహిత్యాన్ని సృష్టించారని పేర్కొన్నారు. యావత్ భక్తి సాహిత్యంలో అన్నమయ్యకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. అన్ని మంత్రాల సారం శ్రీ వేంకటేశ్వర మంత్రంలో ఉందంటూ స్వామివారిపై ఎనలేని భక్తిని చాటారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టుసంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, పుర ప్రజలు పాల్గొన్నారు.