CyberFraud : హైదరాబాద్లో డిజిటల్ అరెస్ట్ మోసం: వృద్ధుడి నుంచి రూ. 53 లక్షలు కొల్లగొట్టిన సైబర్ కేటుగాళ్లు:నగరంలో సైబర్ మోసాలు మళ్ళీ పెరిగాయి. ఈసారి ‘డిజిటల్ అరెస్ట్’ అనే కొత్త పద్ధతిలో అమీర్పేటకు చెందిన 77 ఏళ్ల వృద్ధుడి నుంచి ఏకంగా 53 లక్షల రూపాయలు కొల్లగొట్టారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
సైబర్ నేరగాళ్ల వలకు 77 ఏళ్ల వృద్ధుడు: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ. 53 లక్షలు స్వాహా
నగరంలో సైబర్ మోసాలు మళ్ళీ పెరిగాయి. ఈసారి ‘డిజిటల్ అరెస్ట్’ అనే కొత్త పద్ధతిలో అమీర్పేటకు చెందిన 77 ఏళ్ల వృద్ధుడి నుంచి ఏకంగా 53 లక్షల రూపాయలు కొల్లగొట్టారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
గత నెల 18న బాధితుడికి గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను ఢిల్లీ డీసీపీ రాజీవ్ కుమార్ అని పరిచయం చేసుకున్నాడు. బాధితుడిపై మనీలాండరింగ్ కేసు నమోదైందని, అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందని నమ్మబలికాడు. అంతేకాదు, వెంటనే బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తామని బెదిరించాడు. బాధితుడు తన మాటలు నమ్మేలా చేయడానికి, బ్యాంకు ఖాతాలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లుగా ఒక నకిలీ ఆర్డర్ కాపీని వీడియో కాల్లో చూపించాడు.
దీంతో తీవ్ర ఆందోళనకు గురైన వృద్ధుడు, తనపై కేసు నమోదు చేయవద్దని వారిని వేడుకున్నాడు. ఈ పరిస్థితిని అదునుగా భావించిన నేరగాళ్లు, కేసు నుంచి బయటపడాలంటే తమకు సహకరించాలని సూచించారు. ఖాతాలోని డబ్బును తాము చెప్పిన అకౌంట్కు బదిలీ చేస్తే వాటిని పరిశీలించి తిరిగి జమ చేస్తామని మాయమాటలు చెప్పారు.
నేరగాళ్ల మాటలు నమ్మిన బాధితుడు విడతలవారీగా మొత్తం 53 లక్షల రూపాయలను వారు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశాడు. డబ్బులు అందిన వెంటనే సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. ఎంత ప్రయత్నించినా వారి నుంచి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత లేదా బ్యాంకు వివరాలను పంచుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
Read also:BJP : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఎన్. రామచందర్రావు బాధ్యతల స్వీకరణ
