- రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు కీలక ప్రకటన చేసిన సీఎం
- కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రైతులకు ప్రోత్సాాహకంగా ఇస్తామన్న చంద్రబాబు
- రబీ సీజన్ లో అధార్ అనుసంధానంతో ఇంటి వద్దకే ఎరువులు పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు ముఖ్య ప్రకటన చేశారు. యూరియా వినియోగాన్ని తగ్గించే రైతులు, కౌలు రైతులకు బస్తా కొకటికి రూ.800 చొప్పున ప్రోత్సాహకాన్ని అందజేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు పేర్కొన్నారు.
సచివాలయంలో కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర జీఎస్డీపీపై సమీక్ష నిర్వహించిన సీఎం, వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. యూరియా విక్రయాల నిర్వహణ సక్రమంగా జరిగి ఉంటే ఇలాంటి సమస్యలు తలెత్తేవి కావని అభిప్రాయపడ్డారు. ఎరువుల శాఖలో సరైన మార్పులు జరగకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని కూడా ఆయన అన్నారు.
రబీ సీజన్లో యూరియా కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ-క్రాప్ డేటా ఆధారంగా రైతులకు అవసరమైన యూరియా పరిమాణాన్ని కేటాయించాలని, అవసరమైతే ఆధార్ అనుసంధానంతో ఎరువులను నేరుగా రైతు ఇంటి వద్దకే పంపిణీ చేసే విధానం అమలు చేయాలని సూచించారు.
పంటల విక్రయాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. రైతుకు లాభదాయకమైన వ్యవసాయాన్ని అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
Read : AP : ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలలు: పీపీపీ విధానంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందన
