ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్న సమయంలో ఒకానొక సందర్భంలో ఒకే సరళరేఖలోకి వస్తుంటాయి. వీటిని ప్లానెటరీ కంజెంక్షన్ (గ్రహాల సంయోగం)గా అభివర్ణిస్తుంటాం. తాజాగా శుక్రుడు, గురుడు, చంద్రుడు ఒకే చోటుకు రాబోతున్నారు. నిజానికి ఈ మూడు గ్రహాల మధ్య మిలియన్ కిలోమీటర్ల దూరం ఉన్నా.. ఆకాశంలోకి చూసేటప్పుడు ఇవి ఒకదానితో ఒకటి కలిసిపోయినట్లు, లేదా పక్కపక్కన ఉన్నట్లు కనిపిస్తుంటాయి. జ్యోతిష్యపరంగా కూడా ఇలాంటి గ్రహాల సంయోగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.
మన సౌరవ్యవస్థలో అతిపెద్ద గ్రహం గురుడు, అత్యంత ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు ఈ రెండింటిని కూడా ఎలాంటి టెలిస్కోపులు అవసరం లేకుండా ఆకాశంలో చూడవచ్చు. ముందుగా గురుడు, శుక్రుడు మార్చి 1న సంయోగం జరగనుంది. ఫిబ్రవరి ప్రారంభంలో ఈ రెండు గ్రహాలు 29 డిగ్రీలతో వేరుగా ఉన్నాయి. ఈ నెలఖారు నాటికి రెండు గ్రహాలు కేవలం 2.3 డిగ్రీలతో దగ్గర దగ్గరగా కనిపిస్తుంటాయి. మన సౌర కుటుంబంలో సూర్యుడు, చంద్రుడి తర్వాత అత్యంత ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడే. మార్చి 1 ఒకటిన గురుడు -2.0 మాగ్నిట్యూడ్ తో ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్ కన్నా రెండింతలు గురుడు ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఇదే విధంగా శుక్రుడు -4.0 మాగ్నిట్యూడ్ పరిమాణంతో ప్రకాశిస్తాడు.
ఇదిలా ఉంటే శుక్రుడు, గురుడితో వచ్చే మంగళ, బుధవారాల్లో చంద్రుడు కూడా కలవబోతున్నాడు. ఆ సమయంలో చంద్రుడు కేవలం 4 శాతం ప్రకాశవంతంగా ఉంటాడు. ఇది శుక్రుడి కన్నా 7 డిగ్రీల దిగువన కనిపిస్తుంది. గురుడు ఈ రెండింటితో 8 డిగ్రీలతో వేరు చేయబడి వీటికి పైన ఉంటాడు. నిజానికి భూమి నుంచి చంద్రుడు 3.84 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఇదే విధంగా శుక్రుడు 21 కోట్ల కిలోమీటర్ల దూరంలో, గురుగ్రహం 85.36 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది.