45 రోజుల పాటు రాకపోకలు బంద్
మహబూబ్ నగర్, జనవరి 17,
నారాయణపేట జిల్లా కృష్ణ మండలం రాష్ట్ర సరిహద్దులో కృష్ణా నదిపై నిర్మించిన కృష్ణ బ్రిడ్జిపై నుంచి రాకపోకలను అధికారులు నిలిపివేయనున్నారు. కృష్ణ బ్రిడ్జిపై వెళ్తున్న జాతీయ రహదారి-167 మరమ్మత్తులు చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 5 గంటల నుండి 45రోజుల పాటు వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు రాయచూర్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటక లోని రాయచూరు నుంచి తెలంగాణలోని హైదరాబాద్కు రాకపోకలు సాగించే వాహనాదారులు ఆంక్షలను గమనించాలని కోరారు.
ఇక కృష్ణ వంతెన ను కర్ణాటక ప్రభుత్వం మరమ్మత్తులు చేస్తున్న నేపథ్యంలో NH-167 రహదారిపై వెళ్లే వాహనాదాల కోసం తెలంగాణ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ పెట్టారు. రాయచూర్ కి వెళ్ళే వారు మరికల్ సబ్ స్టేషన్ నుండి చిత్తనూరు, అమరచింత జూరాల డ్యాం, గద్వాల్ మీదుగా కేటీ దొడ్డి రాయచూర్ కు డైవర్షన్ చేశారు. కృష్ణా, మక్తల్, మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనదారులకు అవగాహన నిమిత్తం ఫ్లెక్సీలను ఏర్పాటు చేయనున్నారు.నిజాం నవాబుల పరిపాలన సమయంలో కృష్ణా నదిపై కర్ణాటక – తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపరిచేందుకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. 1933లో ప్రారంభమై 1943 మధ్యకాలంలో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి నాటి నిజాం నవాబులు రూ. 13,28,500 వెచ్చించారు.
కృష్ణా నదిపై 2,488 ఫీట్ల పొడవుతో 20 ఫీట్ల వెడల్పుతో 62 ఫీట్ల ఎత్తులో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి మహమ్మద్ హమీద్ మీర్జా చీఫ్ ఇంజనీర్ గా యూసుఫ్, ఫరహతుల్ల ఇంజనీర్లుగా వ్యవహరించారు.దశాబ్ధాల చరిత్ర కలిగిన కృష్ణా బ్రిడ్జికి 2016లో కర్ణాటక ప్రభుత్వం మరమ్మతులు చేసింది. బ్రిడ్జిపై ధ్వంసమైన రోడ్డు స్థానంలో కొత్తగా సిసి రోడ్డు వేశారు. అయితే సీసీ రోడ్డుతో ప్రయాణికులు ఉపయోగం లేకుండా పోయింది.. వేసిన సిసి రోడ్డు బేరింగ్లు ఎక్కడికక్కడే లేచిపోవడం వాటి మూలంగా ప్రతిరోజు రాత్రి వేళలో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అడుగడుగునా గుంతలు ఉండడంతో ప్రతినిత్యం వాహనాలు ఎక్కడో ఒకచోట ఈ బ్రిడ్జిపై ప్రమాదాలకు కారణమవుతున్నాయి. బ్రిడ్జిపై గుంతలో వాహనాలు ఇరుక్కుంటే మిగిలిన వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి కిలోమీటర్ పొడవున ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో అటు కర్ణాటక పోలీసులు ఇటు తెలంగాణ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు నిత్యం తలనొప్పిగా మారుతోంది.
సమస్య తీరుపై అధికారులు విన్నవించడంతో స్పందించిన అధికారులు గతేడాది ఫిబ్రవరిలో మరో మారు మరమ్మతులు చేయించారు. అయినా మళ్లీ అదే పరిస్థితి ఏర్పడిందిపాత రోడ్డు ఉన్నప్పుడే బాగుండేదని కొత్తగా సీసీ రోడ్డు వేసినప్పటి నుంచి ఈ సమస్య ఎక్కువైందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పుడు ఏకంగా 45 రోజులు బ్రిడ్జిపై వాహనాలు నిలిపి వేసి మళ్లీ మొదటిలాగే మరమ్మతులు చేయడంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. ఇప్పటికైనా కాంట్రాక్టులు నాణ్యతగా రోడ్డు మరమ్మత్తుల చేయాలని కోరుతున్నారు. రాయచూర్ – హైదరాబాద్ మధ్య రాకపోకలు పెరగడంతో ఈ మార్యంలో వాహనాల రద్దీ సైతం పెరిగింది. బ్రిడ్జీ వెడల్పు కేవలం 20ఫీట్లు వెడల్పు మాత్రమే ఉండడంతో భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జీకి మరమ్మత్తులతో పాటు మంజూరైన నూతన బ్రిడ్జీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.