Pawan Kalyan :ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేసినా కొన్ని గణాంకాలు, పద్ధతులు పాటిస్తారు. ప్రతి విషయంలో ప్రజల నుంచి సంతృప్తిని కోరుకుంటారు. చివరికి మద్యంపైనా ఆయన సంతృప్తి పాళ్లను లెక్కించుకున్నారు. అంటే ఇది తప్పుకాదు, ప్రజల అభిప్రాయాలను అన్ని విషయాల్లోనూ తెలుసుకునే ప్రక్రియ.
సర్వే బాట పట్టిన పవన్
విజయవాడ, మే 31
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేసినా కొన్ని గణాంకాలు, పద్ధతులు పాటిస్తారు. ప్రతి విషయంలో ప్రజల నుంచి సంతృప్తిని కోరుకుంటారు. చివరికి మద్యంపైనా ఆయన సంతృప్తి పాళ్లను లెక్కించుకున్నారు. అంటే ఇది తప్పుకాదు, ప్రజల అభిప్రాయాలను అన్ని విషయాల్లోనూ తెలుసుకునే ప్రక్రియ. తద్వారా ప్రభుత్వ విధానాలను సమీక్షించి, అవసరమైతే మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇదే విధంగా ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరును కూడా చంద్రబాబు అంచనా వేస్తూనే ఉన్నారు.ప్రజల అభిప్రాయాల మేరకు మార్పులు చేసుకుంటూ పాలనపై సంతృప్తిని సాధిస్తున్నారు. ఈ పరంపరలోనే కూటమి పార్టనర్ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సర్వేలు చేపడుతున్నారు. తన పార్టీ తరఫున ఆయనతో పాటు ముగ్గురు మంత్రులు ఉన్నారు. వారికి అప్పగించిన శాఖలు సహా తానే చూస్తున్న మూడు నాలుగు శాఖలలో అధికారుల పనితీరును తెలుసుకుంటున్నారు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారు? తాము ఏమి చేస్తున్నారు? అన్న విషయాలను సర్వే రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.తద్వారా ప్రజలకు–పాలనకు మధ్య తేడాలు ఉంటే వాటిని అరికట్టేందుకు, మరింత మంచి పాలనను అందించేందుకు అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.
ఈ క్రమంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కూడా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. మంత్రులుగా ఉన్న ముగ్గురిని తీసేస్తే, జనసేనకు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో నలుగురు నుంచి ఐదుగురి వ్యవహారం వివాదంగా మారిందని జనసేన కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. వ్యక్తిగతంగానే కాకుండా కూటమి పరంగా కూడా ఈ అంశాలు సమస్యలుగా ఉన్నాయి.కూటమి పార్టీలతో కలిసిపనిచేయకపోవడం, స్థానిక నాయకులతో సంబంధాలు లేకపోవడం, నియోజకవర్గంలో ఆధిపత్య రాజకీయాలు వంటి అంశాలు జనసేన నేతల దృష్టికి వెళ్లాయి. వచ్చే ఎన్నికల్లోనూ కూటమితోనే కలసి పోటీ చేస్తున్నామన్న క్లారిటీ రావడంతో పవన్ కల్యాణ్ నియోజకవర్గాల ఇన్ ఛార్జిల విషయంలోనూ ఆచి తూచి వ్యవహరిస్తున్నారట. అనవసరంగా ఎక్కువ మందిని నియమించుకుని, వారు ఏదో వివాదంలో చిక్కుకుని పార్టీకి, తనకు చెడ్డపేరు తెస్తారన్న భయం మాత్రం పవన్ కల్యాణ్ లో కనిపిస్తుంది.
అందుకే ముందుగా ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో నమ్మకమైన నేతలను, సుదీర్ఘకాలం నుంచి పార్టీతో నడుస్తున్న వారికి మాత్రమే ఇన్ ఛార్జి పదవులును కట్టబెడుతున్నారు. అంతే తప్ప 175 నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జుల నియమించి, అక్కడ టీడీపీ, జనసేన లేదా బీజేపీ, జనసేనలకు మధ్య అనవసర వివాదాలు తలెత్తుతాయని భావిస్తున్నారు. అందుకే ఇప్పటి వరకూ చాలా నియోజకవర్గాల్లోనూ ఇన్ ఛార్జులు లేరు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలు పెరిగితే తాను తీసుకోవాల్సిన స్థానాలపై కూడా అంచనా రావడానికి ఒక సర్వే చేయించాలని కూడా పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారని తెలిసింది. పేరున్న సంస్థ చేత సర్వేచేయించి జనసేనకు బలం ఉన్న యాభై నియోజకవర్గాల పేర్లను ఆయన తెప్పించుకోవాలని భావిస్తున్నారు.ఢిల్లీకి చెందిన సంస్థకు ఈ బాధ్యతలను అప్పగించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించినట్లు సమాచారం. సర్వేలో వచ్చిన స్థానాలను అడిగి తీసుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు.
ఆ సర్వే వచ్చిన తర్వాత ఆ స్థానాల్లో ఇన్ ఛార్జులు లేకపోతే అప్పుడు అక్కడ నమ్మకమైన వారిని నియమించడమా? లేదా తనకు దగ్గరగా ఉన్న నేతలను అక్కడ ఇన్ ఛార్జులుగా పెట్టడమా? అన్నది చేస్తారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. యాభై నుంచి అరవై బలమైన అసెంబ్లీ స్థానాలతో పాటు ఐదు పార్లమెంటు స్థానాల పేర్లను కూడా తనకు సర్వే చేసి ఇవ్వాలని సదరు సంస్థకు పవన్ కల్యాణ్ బాధ్యత అప్పగించినట్లు తెలిసింది. అదే నిజమైతే వచ్చే ఎన్నికల్లో జనసేన ఐదు పార్లమెంటు, యాభై శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఆ 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై జనసేన సర్వే చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. తద్వారా విమర్శలు వస్తున్న ఎమ్మెల్యేలు, కలిసిపనిచేయని ఎమ్మెల్యేలు కూడా మార్పు దిశగా తమను తాము మార్చుకుంటారని అంచనా వేస్తున్నారు. మరి ఈ సర్వేలో ఏం జరుగుతుందో చూడాలి.
Read more:Kadapa : ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్
