నిర్మల్
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గౌరీ శంకర్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భైంసాకు చేరుకున్న మంత్రికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుని, పార్టీ కోసం, ప్రజల కోసం అహర్నిశలు పాటుపడే ప్రియతమ నేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పాటుపడాలని అన్నారు. సామాన్యుల కోసం పనిచేసే మనిషి రాహుల్ గాంధీ అన్నారు. ప్రజలు అనుభవిస్తున్న హక్కులన్నీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినవేనని, అనేక భద్రత చట్టాలను తీసుకువచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ప్రతిపక్షాలను విమర్శించడం తప్పితే బీజేపీ చేసిందేమీ లేదని అక్షింతలు మన చేతికి ఇచ్చి అధికారం వారు అనుభవిస్తున్నారన్నారు. పదేళ్ల కాలంలో ఏంచేసారో చెప్పలేని బీజేపీ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ కంపెనీలను కాపాడుతూ పాలన సాగిస్తుందన్నారు. ఈ సందర్బంగా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి సీతక్క కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Prev Post
Next Post