నేతల మధ్య సైలెంట్ వార్
కరీంనగర్, నవంబర్ 4
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే ముందస్తుగా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ ఒకింత దూకుడు పెంచి ప్రతినియోజకవర్గంలో సభలు సమావేశాలు చేస్తుంటే ,బీజేపీ పార్టీ ఇప్పటికి ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై పలు పార్టీల నాయకులు నామినేషన్లు వేస్తున్నా కూడా అభ్యర్థుల ఖరారు ఆలస్యం కావడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పదమూడు నియోజకవర్గాల్లో తొలిజాబితాలో 9 మంది పేర్లను ప్రకటించగా,నాలుగు నియోజకవర్గాలను పెండింగ్ లో ఉంచారు. మూడో జాబితాలో అందరు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తారని ఆశావహులు ఎదురుచూస్తున్న నేపధ్యంలో కేవలం మంథని నియోజకవర్గంలో చందుపట్ల సునీల్ రెడ్డిని ప్రకటించి మరో మూడునియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో కమలనాథుల్లో మరింత ఆందోళన పెరిగింది.
పెద్దపల్లి,వేములవాడ,హుస్నాబాద్ నియోజకవర్గాలను పెండింగ్ లో ఉంచగా అభ్యర్థిత్వం ఎవరికి దక్కుతోందనని తెలియక నేతలు జనం వద్దకు వెళ్లకుండా టిక్కెట్ల కోసం అగ్రనేతల ప్రదక్షణాలు చేయాల్సివస్తోందిపదమూడు నియోజకవర్గాలకు పదినియోజకవర్గాల్లో సజావుగా కొనసాగిన టిక్కెట్ల పంచాయితీ ప్రస్తుతం నేతల మధ్య వార్ కు దారితీస్తుంది. ఎంపీ బండి సంజయ్ ,ఈటెల మధ్య మూడు నియోజకవర్గాల అభ్యర్థులు రోజు ప్రదక్షిణాలు చేయాల్సి వస్తుంది. హుస్నాబాద్ నుండి బొమ్మ శ్రీరాం చక్రవర్తి,జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి పోటీపడుతుండగా,బొమ్మ శ్రీరాంకు బండి మద్దతిస్తుండగా,జన్నపురెడ్డికి ఈటెల అండగా నిలిచారు. ఇద్దరు తమ సన్నిహితులకు టిక్కెట్ల కోసం పోటీపడుతుండడంతో అభ్యర్థిత్వం ఖరారు కాకుండా పెండింగ్ లో పెట్టారు. వేములవాడ నుంచి మాజీ జడ్పీఛైర్ పర్సన్ తుల ఉమ వేములవాడ టిక్కెట్టు పై హమీ ఇవ్వడంతోనే బీఆర్ ఎస్ నుండి బీజేపీలో, ఈటెల రాజేందర్ సమక్షంలో చేరగా ఆమెకు టిక్కెట్టు కోసం ఈటెల గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మాజీ కేంద్రమంత్రి ,మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగార్ రావు కుమారుడు వికాస్ రావు ఇక్కడి నుండి పోటీచేసేందుకు ఆసక్తి చూపుతు ఇటీవలే పార్టీలో చేరగా ఆయనకు టిక్కెట్ ఇప్పించడానికి బండి సంజయ్ తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో దుగ్యాల ప్రదీప్ కుమార్ పేరు బలంగా ఉన్నప్పటికి చివరి నిమిషంలో పలువురు ఇతర పార్టీలనాయకులు బీజేపీ లో చేరడానికి సిద్దమవుతున్న తరుణంలో తుదిజాబితాలోనే అభ్యర్థిని ప్రకటించాలనే ఆలోచనతో పెండింగ్ లో పెట్టారు. జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు తమ సన్నిహితుల కోసం పట్టుపడుతుండడంతో అభ్యర్థుల పేర్లు ప్రకటించడంలేదని కార్యకర్తలు వాపోతున్నారు. నామినేషన్లు వేయడానికి పలు పార్టీలు సిద్దమవుతున్న నేపధ్యంలో పేర్లు ప్రకటించకపోవడం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.