Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

రామగుండంలో చతుర్ముఖ పోటీ

0

కరీంనగర్, నవంబర్ 8, 

రామగుండంలో ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. ఎక్కడ చూసినా.. ప్రచారాల హోరు జోరుగా కొనసాగుతోంది. పలుచోట్ల నువ్వా.. నేనా.. అనే రీతిలో అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలో రాజకీయ వాతావరణం రోజు రోజుకి వేడెక్కుతోంది. ఎన్నికల్లో కీలకంగా మారిన సింగరేణి కార్మికుల ఓట్లపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి.రాష్ట్ర రాజకీయాల్లో రామగుండం రూటే సపరేటు. సందర్భం ఏదైనా, ఈ ప్రాంతం ఒక ప్రత్యేకతను చాటుకుంటూ వస్తుంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా రామగుండం రాజకీయ రణ రంగానికి వేదికగా మారింది. సమీపిస్తున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే, కోరుకంటి చందర్, కాంగ్రెస్ అభ్యర్థి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, బీజేపీ అభ్యర్థి కందుల సంధ్యారాణి పోటీ పడుతున్నారు.

వీరికి ధీటుగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయాన్ని చవి చూసిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకoటి. చందర్ 2018 ఎన్నికల్లో టీఅర్ఎస్ రెబల్‌గా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ వెంటనే గులాబీ గూటికి చేరి ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్  అభ్యర్థిగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యేగా రామగుండంలో తాను సాధించిన అభివృద్ధి తన గెలుపుకు దోహదపడతాయని కోరుకoటి చందర్ భావిస్తున్నారు.కాంగ్రెస్ అభ్యర్థి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కూడా గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన రాజ్ ఠాకూర్, సింపతి వేవ్స్‌తో విజయం సాధిస్తాననే అంచనాలతో ముందుకు సాగుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తనకు లాభిస్తుందని రాజ్ ఠాకూర్ అంచనా వేసుకుంటున్నారు. ఇక, సుదీర్ఘకాలంగా  బీఆర్ఎస్ లో ఉండి ఎమ్మెల్యే టికెట్ ను సాధించడంలో ఆశాభంగానికి గురైన కందుల సంధ్యారాణి, ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల ఉన్న వ్యతిరేకత తనకు లాభించడంతోపాటు ఆడపడుచుగా ఈ ప్రాంత ప్రజలు ఆదరిస్తారన్న ధీమాతో సంధ్యారాణి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ఇక రామగుండం మున్సిపల్ తొలి చైర్మన్ గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సోమారపు. సత్యనారాయణ గత ఎన్నికల్లో టీఅర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి, రెబల్ అభ్యర్థి కోరు కంటి చందర్ చేతిలో పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. గతంలో తాను సాధించిన అభివృద్ధితోపాటు వయసు రిత్యా ఇవే తనకు చివరి ఎన్నికలు కావడంతో ప్రజలు ఆదరించే అవకాశాలు ఉన్నాయని సోమారపు సత్యనారాయణ బలంగా భావిస్తున్నారు.

స్థానికంగా ఉన్న రెండు లక్షల 14 వేల పైచిలుకు ఓట్లలో విన్నింగ్ ఫిగర్‌ను చేరుకునేందుకు ప్రధాన పోటీదారులందరూ అలుపెరుగని ప్రచారాలను నిర్వహిస్తున్నారు. స్థానిక పరిస్థితులు, ప్రజలు, కార్మికుల ఆకాంక్షలను ప్రధాన అస్త్రాలుగా ఎంచుకొని ఓటర్లలో పట్టుకోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.పరిశ్రమలకు నిలయమైన రామగుండంలో సింగరేణి కార్మిక కుటుంబాల ఓట్లే కీలకం.. నియోజకవర్గంలోని మొత్తం ఓట్లలో 35 నుండి 40% ఓట్లు సింగరేణి కార్మిక కుటుంబాలవే కావడంతో వారి మద్దతు కోసం అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులైన కోరుకంటి చందర్, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కందుల సంధ్యారాణితో పాటు స్వతంత్ర అభ్యర్థి సోమారపు సత్యనారాయణ కూడా ప్రచారంలో పదును పెంచడంతో స్థానికంగా చతుర్ముఖ పోటీ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒకరికి దీటుగా మరొకరు ప్రచారాన్ని హోరెత్తిస్తుండడంతో ఈ నలుగురు అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా.. నేనా.. అనే రీతిలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రచార సరళి, ప్రజల నుండి లభిస్తున్న ఆదరణను బట్టి పైకి ఎవరికివారు గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, అంతర్గతంగా విజయావకాశాలు అభ్యర్థులందరినీ హై టెన్షన్ కు గురిచేస్తున్నాయి.ఐతే, ఎన్నికల్లో ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతోనే బయటపడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie