ప్రమోషన్లు… రివర్షన్లు తెరపైకి ఎమ్మెల్వో కమిటీ నివేదిక
విజయవాడ, అక్టోబరు 14,
ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమైన ప్రమోషన్లలో రివర్షన్ల వ్యవహారంలో అడ్డదారిలో ముందుకెళ్లే కుట్రలు జరుగుతున్నాయని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. మిడ్ లెవల్ కమిటీ సిఫార్సులపై ఏజీ నివేదిక సమర్పించడంతో, పదోన్నతుల్లో రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వంలో ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్ల వివాదం మళ్లీ రాజుకుంది. కొన్నాళ్ళుగా సద్దుమణిగిన ఈ వ్యవహారంలో MLOs కమిటీ రూపొందించిన తప్పుడు నివేదికకు తాజాగా అడ్వకేట్ జనరల్ అమోదించి అదే నివేదికను GA పొలిటికల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీకి ఫైల్ రూపంలో పంపించడంతో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సెక్రటేరియట్ మిడిల్ లెవల్ ఆఫీసర్స్ కమిటీ అధికారులు ఏకపక్షంగా రూపొందించిన విధానాలకు ఏజీ ఒపీనియన్ సైతం అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు.ఎమ్మెల్వో కమిటీ నివేదికకు అనుకూలంగా రూపొందిన నివేదిక తాజాగా సిఎస్ను చేరడంతో గురువారం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు సిఎస్కు వినతి పత్రం సమర్పించారు.
పదోన్నతుల వ్యవహారంలో పూర్తి స్థాయి అధ్యయనం చేయకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వఉద్యోగులకు పదోన్నతులు కల్పించేపుడు ప్రస్తుతం పని చేసే స్థానంలో ఉన్న సీనియారిటీని కాకుండా, ఉద్యోగి నియామక తేదీ నుంచి సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలనే నిర్ణయం వివాదాస్పదంగా మారింది. రద్దు చేసిన క్యాచ్ అప్ రూల్ థియరీని తిరగదోడాలని చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, సంఘాలు కొద్ది నెలలుగా రకరకాల పద్ధతుల్లో ఆందోళనలు చేస్తున్నారు.
తాజాగా అడ్వకేట్ జనరల్ నుంచి సిఎస్కు ఫైల్ చేరడంతో ప్రమోషన్లలో రిజర్వేషన్లు రద్దైనట్టేనని చెబుతున్నారు.2006లో నాగరాజ, జర్నైల్ సింగ్ కేసుల్లో సుప్రీం కోర్టు తీర్పు స్పష్టమైన తీర్పులు ఇచ్చినా వాటిని అమలు చేయకుండా, తెలంగాణ GAD డిపార్ట్మెంట్ లో ప్రవేశపెట్టిన క్యాచ్ అప్ రూల్ థియరీ మీద రెండున్నరేళ్లుగా హైకోర్టులో విచారణకు నోచుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం కనీసం కౌంటర్ దాఖలు చేయలేదని, అదే తరహాలో ఇక్కడా కూడా చేయాలని ప్రయత్నిస్తున్నారని ఇది సరికాదని ఉద్యోగులు చెబుతున్నారు.తెలంగాణలో రిజర్వేషన్ల వ్యవహారంలో కోర్టు తీర్పులు, మార్గదర్శకాలు సక్రమంగానే ఉన్నాయని రాహుల్ బొజ్జా నేతృత్వంలోని కమిటీ నివేదికను సిఎస్ సోమేష్ కుమార్ కూడా అమోదించారని గుర్తు చేస్తున్నారు.
మిడిమిడి జ్ఞానంతో ఉన్న మిడ్ లెవల్ అధికారుల బృందం రాజ్యాంగ స్ఫూర్తిగా భిన్నంగా, ఏకపక్షంగా రిజర్వేషన్లలో అవకాశాలను దెబ్బతీసేలా నివేదిక రూపొందించారని రిజర్వుడు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జిఏడిలో రివర్షన్లు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారని తర్వాత మిగిలిన శాఖలకు విస్తరిస్తారని ఆరోపిస్తున్నారు.
ప్రమోషన్లలో రిజర్వేషన్లు రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మండిపడుతున్నారు. ఈ విషయంలో ఆందోళన ఉధృతం చేస్తామని చెబుతున్నారు.